జగన్ వి విధ్యంసక చర్యలు
ఒంగోలు ఫిబ్రవరి 10
రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఒంగోలులోని శైలజానాధ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై కక్షతో ప్రజావేదికను కూల్చడం దారుణమన్నారు. ప్రజావేదిక సుమారు 8 కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ ఆస్తి అని, అలాంటి ప్రజావేదికను ముఖ్యమంత్రి జగన్ కూల్చివేయించడం బాధాదాకరమన్నారు. అవసరమైతే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకుని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలే తప్ప కూల్చివేసి ప్రభుత్వ ఆస్తిని నష్టం చేయడం సరైన చర్య కాదన్నారు.రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ అమరావతి రాజధానిగా తాము స్వాగతిస్తున్నట్లు తెలియజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అయితే రాష్ట్ర రాజధానిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టిందని అన్నారు. రాజధాని అనేది శాశ్వత అంశమని, ప్రత్యేక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తరువాతనే రాష్ట్ర రాజధానిని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకి స్పష్టంగా చెప్పినప్పటికీ చంద్రబాబు వినకుండా ఏకపక్షంగా రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించారని వివరించారు.