ముచ్చటగా మూడోసారి కూడా ఢిల్లీ కా రాజా నేనే
దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తున్నా... కూడా ఢిల్లీ మాత్రం ఆయన పీఠం చెక్కు చెదరలేదు. ముచ్చటగా మూడోసారి కూడా ఢిల్లీ కా రాజా నేనే అంటూ సత్తా చాటారు అరవింత్ కేజ్రీవాల్. దేశ రాజధానిలో తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని సత్తా చాటారు. సరిలేరు నాకెవ్వరూ అంటూ... పోరాడి నిలబడ్డారు. చీపురు గుర్తుతో చిన్న పార్టీ పెట్టిన కేజ్రీ అతితక్కువ కాలంలోనే దేశ రాజకీయాల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రముఖ రాజకీయ నాయకుడే కాదు... సామాజిక ఉద్యమకారుడు కూడా. హర్యానాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు. నకిలీ రేషన్ కార్డుల కుంభకోణాన్ని బయట పెట్టేందుకు 1999 లో చేపట్టిన పరివర్తన్ (మార్పు) ఉద్యమంతో ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆదాయ పన్ను, విద్యుత్తు, ఆహర, రేషన్ పదార్థాల విషయాల పట్ల ఢిల్లీ పౌరుల పక్షాన ఆయన పోరాడారు. మరిన్ని సామాజిక సమస్యలపై దృష్టి పెట్టేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి, 2006 లో పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించారు.2010 లో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి జన్ లోక్పాల్ బిల్లు ఆమోదం కోసం చేపట్టిన ఉద్యమంతో కేజ్రీవాల్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఈ ఉద్యమం ఆయన రాజకీయ భవిష్యత్తునే మార్చేసింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో రాజకీయ జోక్యంపై అన్నా హజారేతో విభేధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరిట కేజ్రీవాల్ సొంత పార్టీని ఏర్పాటు చేశారు. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి 70 స్థానాలకు గానూ కేవలం 28 సీట్లనే సాధించింది. కాంగ్రెస్ షరతులతో కూడిన మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. జన్ లోక్పాల్ బిల్లు ఆమోదంలో వైఫల్యాన్ని కారణంగా చూపుతూ 49 రోజులకే సీఎం పదవికి రాజీనామా చేశారు.ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం, 16 వ లోక్సభ ఎన్నికల్లో ఆయన వారణాసి నుంచి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గానూ 67 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. కేజ్రీవాల్ ఢిల్లీకి ఏడవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.తనదైన రాజకీయ దార్శనికత, ప్రజలకు సేవలందించాలన్న తపనతో దేశ రాజకీయాల్లో కేజ్రీవాల్ శిఖర సమాన స్థాయికి ఎదిగారు.ఇప్పుడు తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన సత్తా చాటారు. హ్యాట్రిక్ విజయాన్ని చేజెక్కించుకొని మరోసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు