మూడు వెనుక కేంద్రం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11,
కేంద్ర ప్రభుత్వం ఏపీలో మూడు రాజధానుల ఫార్ములాకు సుముఖంగానే ఉందని అంటున్నారు. ఏపీ విషయంలో బీజేపీ సర్కార్ వైఖరి పూర్తిగా జగన్ కి అనుకూలమనేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల కధను సుఖాంతం చేసేందుకు కేంద్రం కూడా దారి చూపుతోందని అంటున్నారు. కేంద్రంలోని పెద్దలకు జగన్ ఈ విషయం కూడా ముందే చెప్పి ఉంచారన్న మాట కూడా ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. అందుకే జగన్ బేఫికర్ గా ఉంటున్నారని భావిస్తున్నారు.ఇదిలా ఉండగా ఏపీలో మూడు రాజధానుల విషయం తనకు ఎపుడో తెలుసని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ బాంబు పేల్చారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఏపీకి మూడు రాజధానులు వస్తాయని ఢిల్లీలో ఒక ప్రముఖ జాతీయ నాయకునితో జగన్ తన ఆలోచనలు పంచుకున్నారని ఆ విధంగా తనను ఈ విషయం చాలా కాలం క్రితమే తెలుసు అని ఆయన అంటున్నారు. అయితే అప్పట్లో ఒంగోలు రాజధాని అవుతుందని తాము అంతా భావించామని, అయితే అక్కడ కొన్ని సమస్యలు ఉండడం వల్ల జగన్ విశాఖకు రూట్ మార్చారని ఆయన చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా కర్నూల్లో హైకోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని కూడా టీజీ అంటున్నారు. ఆ విధంగా పాలనా వికేంద్రీకరణకు కేంద్రం సహకరిస్తుందని ఆయన అంటున్నారు. కేంద్రం ధోరణి చూసినా జగన్ దూకుడు చూసినా కూడా ఒక అవగాహనతోనే మూడు రాజధానుల వ్యవహారం తీసుకువచ్చారని అనిపిస్తోందని కూడా ఆయన విశ్లేషిస్తున్నారు. ఇక జగన్ కేవలం హైకోర్టు మాత్రమే కర్నూలులో పెడితే వూరుకోమని కూడా టీజీ హెచ్చరిస్తూ రాజధాని అయినా ఇవ్వాలి. లేకపోతే కీలకమైన విభాగాలు కూడా తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటిదాకా కేంద్రం మీద పెద్దాశలు పెట్టుకున్న ఏపీలోని విపక్షానికి గట్టి షాక్ తగలబోతోంది. కేంద్రం దగ్గరుండి మూడు రాజధానుల ఫార్ములాను ముందుకు నడిపించేలా ఉందంటూ ఢిల్లీ కధనాలు కూడా తెలియచేస్తున్న నేపధ్యంలో ఎంత ఆందోళన చేసినా చంద్రబాబు కలల రాజధాని అమరావతి కరిగిపోకతప్పదని అంటున్నారు. ఏపీలో రాజధానికి కానీ, ఇతర విభజన హామీలకు కానీ నిధులు ఇవ్వలేని కేంద్రం తరుణోపాయంగా ఈ విధంగా సూచించినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి చూసుకుంటే జగన్ ని నడిపించేది కేంద్రమేనని ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.