శాసనమండలి కార్యదర్శిపై పీనల్ యాక్షన్: యనమల
అమరావతి ఫిబ్రవరి 11
శాసనమండలి కార్యదర్శిపై పీనల్ యాక్షన్ తీసుకుంటామని టీడీపీ సీనియర్, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వెల్లడించారు. చైర్మన్ విచక్షణాధికారాలను ప్రశ్నించే అధికారం కోర్టులకు కూడా లేదని యనమల స్పష్టం చేశారు. చైర్మన్ ఆదేశాల ధిక్కరణపై కార్యదర్శికి శిక్ష విధిస్తే డీజీపీ అమలు చేయరా? అని ప్రశ్నించారు.సీఎం నిర్ణయాన్ని సీఎస్ వ్యతిరేకిస్తారా? అని నిలదీశారు. చెడు సంప్రదాయాలకు తెరలేపొద్దని యనమల హితవు పలికారు. ధిక్కరణ నోటీసు ఇవ్వడం లేదా ప్రివిలేజ్ మోషన్ పెట్టడం.. ఏం చేయాలనేది రెండు రోజుల్లో తేలుస్తామన్నారు. శాసనమండలి ధిక్కరణ కింద నోటీసులు ఇస్తామన్నారు. మండలిలో చర్చించి అప్పటికప్పుడే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కౌల్ సెక్టార్ 595వ పేజీలో 14 రోజుల నిబంధన లేదన్నారు. అది మనీ బిల్లు అయితేనే ఆమోదించాలన్నారు. ఉమ్మారెడ్డి లాంటి వాళ్లు పుస్తకాలు గట్టిగా చదవాలని యనమల హితవు పలికారు. బిల్లులు సెలెక్ట్ కమిటీ దగ్గర ఉన్నప్పడు ఆర్డినెన్స్లు ఇవ్వలేరన్నారు. మండలిని ప్రోరోగ్ చేసినా బిల్లులు లైవ్లో ఉన్నట్టేనన్నారు. ఆర్డినెన్స్లను గవర్నర్ అంగీకరించరని.. కోర్టులో నిలబడవని యనమల స్పష్టం చేశారు.