భద్రత తొలగింపు పట్ల టీడీపీ నేతలు ఆందోళన..
సమాచారం లేకుండా భద్రత తొలగించారు
సంఘ విద్రోహ శక్తుల నుంచి తమకు ముప్పు ఉంది..దేవినేని
అమరావతి ఫిబ్రవరి 11
టీడీపీకి చెందిన మరికొందరు ముఖ్య నేతల భద్రతను ప్రభుత్వం తొలగించింది. ఇప్పటికే మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డిల భద్రతను తొలగించిన ప్రభుత్వం.. తాజాగా కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమ, పల్నాడులో సున్నిత ప్రాంతమైన గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేనికి రక్షణ తొలగిస్తూ ఇవాళ ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వెంటనే వెనక్కు వచ్చేయాల్సిందిగా వారి గన్మెన్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నంలోపు గన్మెన్లందరూ హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే భద్రత తొలగించామని పోలీసులు చెబుతున్నారు. అయితే తమ భద్రత తొలగింపుపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తమకు ఎటువంటి ముందస్తు నోటీసులు.. సమాచారం లేకుండా ఉన్నపళంగా భద్రత తొలగించడం ఏంటని ప్రభుత్వాన్ని నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమకు భద్రత కొనసాగించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత భద్రతను కుదించి.. ప్రస్తుతం పూర్తిగా తొలగించడంపై నేతలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లకుండా నిలువరించేందుకు ప్రభుత్వం భద్రతను తొలగించిందని నేతలు పేర్కొంటున్నారు.టీడీపీ ముఖ్యనేతలకు కక్ష్యపూరితంగా గన్మెన్లను తొలగించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తుల నుంచి తమకు ముప్పు ఉందని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారని, మంత్రులే బహిరంగంగా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ చిన్నాన్న వివేకాకే దిక్కులేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో తమ వల్ల ఇబ్బందులు పడ్డ సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ముప్పు ఉందన్నారు. ప్రభుత్వ చర్యలకు భయపడేది లేదని దేవినేని ఉమ స్పష్టం చేశారు.