ఫలించని చంద్రబాబు వ్యూహాలు
విజయవాడ, ఫిబ్రవరి 12,
ఏపీ రాజకీయాల్లో తీవ్ర కుదుపు రానుందా? ఏపీలో కీలకమైన పార్టీ మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొననుందా? అంటే.. ఔననే అంటోంది జాతీయ మీడియాలోకి ఓ ప్రధాన పత్రిక. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఇప్పుడున్న పరిస్థితిని ఇలానే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో కష్టాల సుడిగుండంలో కొట్టుకుపోవడం ఖాయమని ఈ మీడియా హెచ్చరించింది. దీనికి సంబంధించి తెలంగాణలో టీడీపీ అనుభవాలను ఈ పత్రిక గుర్తు చేయడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారిందనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. అదే సమయంలో ఏపీలోనూ పరిస్థితి గడ్డుగా ఉందని అంటున్నారు.ఏపీలో బలమైన ప్రభుత్వం మరింత బలంగా తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు కూడా దాదాపు ఆమోదం చెబుతున్న పరిస్థితి కనిపిస్తోందని, కానీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ వీటిని రాజకీయంగా వినియోగించుకోవాలని చూస్తున్నప్పటికీ.. ఎక్కడా ఫలించడం లేదని జాతీయ మీడియా ప్రధానంగా ప్రస్థావించింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో అధికారులను, పెట్టుబడి దారులను అతిగా నమ్మించారని, ఫలితంగా వారంతా కూడా చంద్రబాబు వ్యూహానికి చిక్కుకున్నారని ఈ మీడియా వేలెత్తి చూపింది.కొందరు అధికారులు ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో ఎదురీతలు ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ప్రస్థావించింది. అదేవిధంగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతాననే చంద్రబాబు మాటలను నమ్మిన ఆయన సామాజిక వర్గం ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు పెట్టిందని, అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ వర్గం భారీగా నష్టపోతోందని, ఈ ఒత్తిడితోనే చంద్రబాబు ఉత్తరాంధ్ర వంటి జిల్లాల్లో నష్టం వచ్చినా.. పార్టీని కేవలం అమరావతికే పరిమితం చేసేందుకు సైతం సిద్ధమయ్యారని ఈ కథనం పేర్కొనడం విశేషం.అయినా కూడా చంద్రబాబు వ్యూహాలు ఫలించకపోగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు కొంత ఆలస్యంగా నైనా అర్ధం చేసుకుంటున్నారని ఈ కథనం స్పష్టం చేసింది. ఇదే క్రమంలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా.. టీడీపీ వాళ్ల మూలాలను జగన్ దెబ్బ తీస్తున్నా ప్రజల్లో మాత్రం వాళ్లపై ఎలాంటి సానుభూతి లేకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారని కూడా ఈ కథనం పేర్కొంది. మున్ముందు కూడా చంద్రబాబు ఇలానే ఉంటే పరిస్థితి మరింత చేజారుతుందని, అదీకాక ఆయన తర్వాత పార్టీని లీడ్ చేయగలిగే నాయకుడు కూడా ఇప్పుడు లేకపోవడం పార్టీని మరింతగా కుంగదీస్తోందని జాతీయస్థాయిలో ప్రాచుర్యం ఉన్న రిపబ్లిక్ ఛానల్ కథనం ప్రసారం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో ? చూడాలి.