జాతీయ రహదారులపై కొనసాగుతున్న సందిగ్ధత
వరంగల్, ఫిబ్రవరి 12,
జాతీయ రహదారుల విషయంలో సందిగ్థవ కొనసాగుతోంది. రాష్ట్రం కోరిన 1700 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలు గత రెండేండ్లుగా పెండింగ్లో పెట్టడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. ఇందులో దాదాపు 1000 కిలోమీటర్ల మేర రహదారులకు డీపీఆర్ (పూర్తిస్థాయి నివేదిక)ను సమర్పించినవే ఉండడం గమనార్హం. సీఎం కేసీఆర్, రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జాతీయ రహదారులను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఉన్నతాధికారులు ఇప్పటికే పలుమార్లు కేంద్ర అధికారులు అడిగిన వివరాలను అందజేశారు. ప్రతిపాదిత జాతీయ రహదారుల అవసరాన్నీ, సాధ్యాసాధ్యాలను ఏకరువు పెట్టినప్పటికీ కేంద్రం కనికరించడం లేదు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో కేంద్రం నుంచి మంజూరవుతున్న జాతీయ రహదారులే తక్కువగా ఉంటుండగా, అందులోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు విషయంలోనూ రెండు వేర్వేరు డీపీఆర్లను కేంద్రం కోరింది. అందులో ఒకటిని మాత్రమే ఆమోదించి చేతులు దులుపుకున్నది. జాతీయ రహదారిగా ప్రకటించిన భాగానికి కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి మంజూరు చేయలేదు. సమీప భవిష్యత్తుల్లో నిధులు విడుదల చేసే పరిస్థితులు కనిపించడం లేదని అధికారులు అంచనా వేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా సొంతంగా ప్రాజెక్టు చేపట్టే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయాలపై దష్టి సారించారు. రీజినల్ రింగ్ రోడ్డు 340 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.7000 కోట్లు ఖర్చు కానుండగా, భూసేకరణకు మరో రూ.3000 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా. ఒయాన్స్, ఫీడ్బ్యాక్ కన్సల్టెన్సీలకు ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలతో నివేదిక సమర్పించాలని కోరారు. గతంలో నార్కట్పల్లి - అద్దంకి రహదారి, రాజీవ్ రహదారిని బీఓటీ పద్దతిలో నిర్మించిన విషయం విదితమే. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ విధానం)తో పాటు తక్కువ వడ్డీకి బయటి నుంచి అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు వేయడం, ల్యాండ్ ఫూలింగ్ తదితర అన్ని మార్గాలను కన్సల్టెన్సీలు పరిశీలించనున్నాయి. ఇప్పటికే అధ్యయనం మొదలెట్టిన కన్సల్టెన్సీలు త్వరలోనే నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ విషయంలో ఇది విజయవంతమైతే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న మిగిలిన రోడ్ల విషయంలోనూ ఇదే పద్దతిలో ముందుకెళ్లే అవకాశమున్నది.ఎల్.బీ.నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు వేయాలని భావిస్తున్న 8 లైన్ల రహదారికి కేంద్రం ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.300 కోట్ల వ్యయం అయ్యే దీని విషయమై కేంద్ర వార్షిక ప్రణాళికలో చేర్చడంతో దీనికి త్వరలోనే గ్రీన్ సిగల్ ఇస్తారని భావిస్తున్నారు. 20 కిలోమీటర్ల మేర ఉద్దేశించిన ఈ రహదారికి సంబంధించిన విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గురువారం ఢిల్లీ నుంచి ప్రాంతీయ అధికారి రానున్నారు. రాష్ట్ర అధికారులతో కలిసి ఆయన స్థానికంగా పర్యటించి విషయాలను సేకరించనున్నారు. కాగా ఆదిలాబాద్ లో నిర్మల్ - ఖానాపూర్ (20 కిలోమీటర్లు) రూ.150 కోట్ల అంచనా వ్యయం, నకిరేకల్ - నాగార్జునసాగర్ (30 కిలోమీటర్లు) రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఉన్న రోడ్లకు ఇప్పటికే జాతీయ రహదారులుగా పరిగణిస్తూ మంజూరు ఇచ్చిన సంగతి తెలిసిందే.