కమలం పార్టీలో ఆధిపత్య పోరు
విజయవాడ ఫిబ్రవరి 12,
నిన్న మొన్నటి వరకు ఏపీ బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు తెగ తాపత్రయ పడ్డారు. రాజధాని అమరావతి విషయంలో నువ్వు పేరు కొట్టేస్తావా? అంటే.. నువ్వు పేరు కొట్టేస్తావా ? అంటూ ఒకరితో ఒకరు పొటీ పడి మరీ వ్యాఖ్యలు చేసుకున్నారు. జగన్పై విమర్శలు సంధించుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒకరు నేరుగా కేంద్ర ఆశీర్వాదం తనకే ఉందని, కీలకమైన నేతలకు తాను తలలో నాలుకగా ఉంటున్నానని చెప్పుకొంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.మరొకరు కూడా ఇదే తరహాలో నాకు ఏకంగా ప్రధాని మోడీ వద్దే యాక్సస్ ఉందని చెబుతూ. జగన్ ప్రభుత్వంపై మాటల తూటాలు సంధించారు. ఈ ఇద్దరు నాయకులు కూడా ఎవరికి వారుగా అమరావతి రైతుల కు మద్దతు ప్రకటించారు. ఎవరికి వారుగా పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే, వీరికి ఇప్పుడు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయని అంటున్నారు కమలం పార్టీలోని మరికొందరు కీలక నేతలు. ఇద్దరి దూకుడును గమనించిన వారు ఇప్పుడు వీరిని చూసి ముసిముసినవ్వులు నవ్వుతున్నారు.గడిచిన రెండు మూడు రోజులుగా ఇటు కన్నా లక్ష్మీనారాయణ కానీ, అటు మాధవ్ కానీ పెద్దగా మీడియా ముందుకురావడం లేదు. దీంతో అసలు ఏం జరిగి ఉంటుందనే అంశం ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళ్తే.. ఇన్నాళ్లు వీళ్లు పట్టు కుని వేలాడిన అమరావతి విషయంలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయం జగన్కు జల్లకాయ కొడుతుందని, దీంతో ఏపీలో ఇకపై కమల నాథులుగా తాము కాలర్ ఎగరేయొచ్చని వీరు భావించారు. ఈ నేపథ్యంలో తాము అనుకున్నది సక్సెస్ అయితే.. ఎవరికి వారుగా చక్రం తిప్పొచ్చని అనుకున్నారు.కానీ, ఇప్పుడు అమరావతి విషయంలో కేంద్రం పాత్ర ఏంటనేది స్పష్టం చేసిన తర్వాత మరీ ముఖ్యంగా జీవీఎల్ నర సింహారావు వంటి నాయకుడు ఏపీ విషయంపై కుండబద్దలు కొట్టిన తర్వాత ఇక, ఈ ఇద్దరు నాయకులు కూడా మీడియాకు ముఖం చూపించలేక పోతున్నారట. ఈ పరిణామం వారికి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటే వీరితో విభేదించిన సోము వీర్రాజు వంటి వారికి మాత్రం సంతోషం కలిగించిందట. సో.. మొత్తానికి ఏపీ బీజేపీలో పరిణామాలు ఇలా ఉన్నాయన్నమాట.