కమలంలో వర్రీ...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12,
పాకిస్థాన్ ను కట్టడి చేస్తే ఎవడిక్కావాలి? చైనాతో ధీటుగా ఉంటే ఎవడికి ప్రయోజనం? ట్రంప్ తో జట్టుకడితే మాకేంటి? కాశ్మీర్ లో 370 అధికరణాన్ని తొలగిస్తే ఎవరికేంటి? పౌరసత్వ చట్ట సవరణ చేసి దేశభక్తి అంటే ఎలా? ఇలా ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చతికల పడటానికి కారణాలు వేరే చెప్పనక్కరలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ అంశాలనే ప్రధానంగా చూపి గద్దె నెక్కాలనుకున్న కమలనాధులకు ప్రజలు చెక్ పెట్టారు. ఢిల్లీ సంగతి చూడకుండా పాక్ అంటూ రాగాలు తీస్తే ఎలా? అంటూ తమ తీర్పుతో బీజేపీని గట్టిగానే ప్రశ్నించారు.నిజానికి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎన్నికలపై గట్టి ఆశలే పెట్టుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి జబ్బలు చరిచింది. కానీ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల మ్యాజిక్ ఢిల్లీ ఎన్నికల్లో పనిచేయలేదనే చెప్పాలి. 200 మంది పార్లమెంటు సభ్యులను ఎన్నికల ప్రచారంలో దించినా, యాభై చోట్ల అమిత్ షా రోడ్ షోలు నిర్వహించినా కూడా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీనికి కారణం స్థానిక అంశాలేనని చెప్పకతప్పదు.ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక గుణపాఠంగా చెప్పాలి. ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై కాకుండా జాతీయ, అంతర్జాతీయ అంశాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆశించి కమలనాధులు భంగపడ్డారని చెప్పక తప్పదు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, కేజ్రీవాల్ ను తన పని తాను చేసుకోనివ్వరని తెలిసినప్పటికీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపలేదు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందన్న బీజేపీ ఆశలు కూడా ఆవిరయిపోయాయి.అయితే ఆనందపడాలో? బాధపడ్డాలో తెలియదు కాని బీజేపీ గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించడం మాత్రం గుడ్డిలో మెల్లగా అని చెప్పాలి. 2015 ఎన్నికల్లో కేవలం మూడు సీట్లకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు కొంత ఊరటనిచ్చే స్థానాలను సాధించింది. కానీ ఒక్క నిజం మాత్రం గుర్తుంచుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నామని రాష్ట్రాలపై పెత్తనం చేస్తామంటే కుదరదని కమలనాధులు తెలుసుకోవడం మంచిది. ఇప్పటికైనా కేజ్రీవాల్ కు అభివృద్ధి విషయంలో అండగా నిలిస్తే భవిష్యత్తులోనైనా ఢిల్లీ పీఠం దక్కే అవకాశముంది.