16న ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ ఫిబ్రవరి 12
ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆనందోత్సహాల్లో మునిగితేలుతుంది. ఈ నెల 16న ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరగనుంది. ఇవాళ ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ను రాజ్భవన్లో అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. ఆప్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ను కేజ్రీవాల్ కోరారు. 15 నిమిషాల పాటు రాజ్భవన్లో కేజ్రీవాల్ ఉన్నారు. రాజ్భవన్ను తన నివాసానికి తిరిగి వచ్చిన కేజ్రీవాల్ను కలిసేందుకు నూతన ఎమ్మెల్యేలు తరలివస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో శాసనసభాపక్షనేతను ఎన్నుకోనున్నారు.ఇక 2012, నవంబర్లో ఆప్ను స్థాపించిన కేజ్రీవాల్.. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేశారు. నాడు హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్ది రోజులకే ఇరు పార్టీల మధ్య విబేధాలు తలెత్తడంతో, 2014 ఫిబ్రవరి 14న సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. 2015 ఎన్నికల్లో ఆప్ 67 స్థానాల్లో గెలిచి.. అధికారంలోకి వచ్చింది. 2015, ఫిబ్రవరి 14న రామ్లీలా మైదానం వేదికగా సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఇప్పుడు కూడా ఫిబ్రవరి 14నే కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణం చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తేదీన కాకుండా 16న సీఎంగా ప్రమాణం చేయనున్నారు కేజ్రీవాల్.