మోడీ, ట్రంప్ రోడ్ షో
గాంధీనగర్, ఫిబ్రవరి 15
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు బ్రహ్మండమైన రోడ్షోకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 22 కిలోమీటర్ల పొడవునా రోడ్షో సాగుతుంది. దారి పొడవునా 50వేల మందికి పైగా జనం ఇరువైపులా గుమికూడుతారని వెల్లడైంది. ఈ నెల 24వ తేదీన ట్రంప్, ప్రధాని మోడీతో కలిసి ఈ రోడ్షోలో పాల్గొంటారని అహ్మదాబాద్ మేయర్ బిజాల్ పటేల్ శుక్రవారం తెలిపారు. ఒక అతిథికి నగరం పలికే అతి పెద్ద స్వాగత ఘట్టం ఇదేనని ఆమె ఇక్కడ విలేకరులకు చెప్పారు. 22 కిలోమీటర్ల రోడ్షో కోసం చాలా రోజులుగా సన్నాహాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు ట్రంప్, మోడీల అహ్మదాబాద్ పర్యటన వివరాల రోడ్ మ్యాప్ విడుదల చేశారు.దీని ప్రకారం ఇద్దరు నేతలు విమానాశ్రయం నుంచి నేరుగా తొలుత గాంధీజీ అనుబంధిత సబర్మతీ ఆశ్రమానికి వెళ్లుతారు. అక్కడి నుంచి ఇందిరా బ్రిడ్జి మీదుగా ఎస్పి రింగ్రోడ్ నుంచి మోటేరాలోని సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం చేరుకుంటారని పటేల్ తెలిపారు. బిజెపి కార్యకర్తలతో పాటు అరలక్షకు పైగా జనం రాదారి ప్రదర్శనకు తరలివస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. దారిపొడువునా నేతలకు జనం గ్రీటింగ్స్ తెలుపుతారు. 300 సంస్థలు, పలు ఎన్బిఒల వారు తరలివస్తారని వివరించారు. లక్షమంది వరకూ కూర్చునేందుకు వీలున్న అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ట్రంప్, మోడీలు సంయుక్తంగా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతారు.