వైసీపీ మైండ్ గేమ్...డిఫెన్స్ లో జనసేనాని
విజయవాడ, ఫిబ్రవరి 17,
ఏపీ రాజకీయల్లో పవన్ కల్యాణ్ తీరు ఇపుడు మళ్ళీ అయోమయంలో పడింది. ఆయన మాటలు చూస్తున్నా కూడా బేలతనం కనిపిస్తోంది. అమరావతి రైతులను పరామర్శించినపుడు పవన్ ఎవరు తనతో ఉన్నా లేకున్నా పోరాటం ఆగదని చెప్పడం విశేషం. అంటే బీజేపీ మీద పవన్ ఆశలు దాదాపుగా వదిలేసుకున్నట్లు కనిపిస్తోంది. . బీజేపీకి ఈ విషయంలో మొహమాటాలు ఏవీ లేవు. ఏపీలో అధికార వైసీపీతో కలసి అడుగులు వేస్తుంది. రాజకీయంగా జగన్ అంటే గిట్టని పవన్ కల్యాణ్ కి ఇది ఇబ్బందికరం. దానికి తోడు పొత్తు అంటూ బయటకు గట్టిగా చెప్పుకున్నా మర్యాదలు మన్ననలూ అన్నీ కూడా వైసీపీకే ఉంటాయి. దాంతో బీజేపీ పొమ్మనకుండానే పొగ పెట్టినట్లవుతుంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారిపోయింది. తమ పార్టీతో పొత్తుకు ఒకే చెప్పి వైసిపి తో బిజెపి సహజీవనాన్ని జనసేనాని జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలా అయితే కొంత కాలం వేచి చూసి కమలానికి గుడ్ బై కొట్టేయడమే బెటర్ అనే రీతిలో తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అర్ధం పడుతున్నాయి. వైసిపి ఆడుతున్న మైండ్ గేమ్ దెబ్బకు జనసేనకు సౌండ్ లేకుండా పోయింది.కమలం రమ్మనకపోయినా తనకు తానుగా బిజెపి తో జట్టుకట్టిన పవన్ కళ్యాణ్ కు బిజెపి అధిష్టానం అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది స్పష్టం అయిపోతుంది. కాషాయంతో జత కడతా అంటూ ఢిల్లీ వెళ్ళిన పవన్ కి ప్రధాని తో కానీ, అమిత్ షా తో అపాయింట్ మెంట్ లభించలేదు. బిజెపి అధ్యక్షుడు నడ్డాతో భేటీ తరువాత తమ రాష్ట్రస్థాయి నాయకత్వంతో సర్దుకు పోవాలంటూ అధిష్టానం సూచించింది. దాంతో పవన్ కల్యాణ్ వంటి క్రేజీ స్టార్ కి ఇవ్వాలిసిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నది అందరికి అర్ధం అయ్యేలా వ్యవహారం సాగించింది బిజెపి.రాబోయే రోజుల్లో వైసిపి నుంచి ఎన్నికయ్యే రాజ్యసభ సభ్యుల అవసరం బిజెపి సర్కార్ కి తప్పనిసరిగా మారింది. ఉత్తరాదిన అసెంబ్లీ ఎన్నికల్లో తగులుతున్న షాక్ లతో రాజ్యసభ లో కమలదళానికి ప్రాతినిధ్యం క్షిణించనుంది. ఈ నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో వైసిపి నుంచి పదిమంది వరకు రాజ్యసభకు వెళ్ళే అవకాశాలు ఉండటం వారంతా కీలక బిల్లుల ఆమోదానికి సహాకారం ఇవ్వాలిసిన పరిస్థితి వైసిపి కి కలిసొచ్చేలా రాజకీయం నడవనుంది. దాంతో జగన్ చకచకా పావులు కదిపారు. మోడీ, షా లనుంచి రాజకీయ సహకారం గట్టిగా రావడం ఆయనకు లభించిన అపాయింట్మెంట్ లే చెప్పక చెప్పేశాయి.అంతేకాదు మూడు రాజధానుల జగన్ నిర్ణయానికి కేంద్రం లోపాయికారిగా సంపూర్ణ మద్దతును వెనుక నుంచి ఇస్తుంది. ఇదే పవన్ కల్యాణ్ లో కలవరానికి కారణం అయ్యింది. ఎదో చేద్దామని బిజెపి కి దగ్గరయితే వున్న ఉనికే కోల్పోయే ప్రమాదాన్ని పవన్ కళ్యాణ్ పసిగట్టేశారు. దాంతో అమరావతి పై కేంద్రం స్టాండ్ పూర్తిగా తెలిసాక వారు జగన్ నిర్ణయం వైపే మొగ్గు చూపితే మాత్రం కాషాయానికి విడాకులు ఇచ్చేయడమే బెటర్ గా జనసేనాని తేల్చి చెప్పేశారు. శరవేగంగా మారుతున్న ఎపి రాజకీయాల్లో ఇప్పుడు ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి స్పష్టం గా కనిపిస్తుంది. దీంతో పవన్ కల్యాణ్ మళ్ళీ తన పాత మిత్రుడు చంద్రబాబుతోనే కలసి పోరాటాలు చేయాల్సివస్తుంది. పవన్ ఇలా అయిదేళ్ళలో పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్లుగా అన్ని పార్టీలను చుట్టేసి మళ్ళీ మొదటికే వస్తారన్న విమర్శలు కూడా భరించాల్సివస్తుంది. ఇక టీడీపీ, పవన్ కల్యాణ్ కలసినా ఆ జోష్, మునుపటి రాజకీయ దూకుడు రావడం కష్టమేనని అంటున్నారు. అయినా తప్పదు కాబట్టి పవన్ కల్యాణ్ ఆ రూట్లోనే వెళ్తారని అంచనా వేస్తున్నారు. అమరావతి టూర్లో పవన్ ముస్లింల నమాజ్ సందర్భంలో తన ప్రసంగాన్ని ఆపేయడం చూస్తూంటే ఫ్యూచర్లో ఆయన కూడా సీఏఏకు వ్యతిరేకంగా గొంతు సవరిస్తారేమోనని కూడా అంటున్నారు. చూడాలి మరి.