రాజమండ్రి, ఫిబ్రవరి 18, ఏపీ రాజకీయాల్లో కమలం పార్టీ కన్ఫ్యూజన్ కొనసాగుతూనే వుంది. ఒక్కో నేత ఒక్కోరకమైన వ్యాఖ్యలతో వారి పార్టీలో అయోమయాన్ని మరింతగా పెంచుతున్నారు. జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయం దగ్గర నుంచి మండలి రద్దు వరకు బీజేపీ నేతల వైఖరి భిన్నమైన దారుల్లో వెళ్లడంతో రాష్ట్ర పార్టీ వ్యూహాని,కి కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి బాగా తేడా స్పష్టం అయిపోతుంది. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తమ పార్టీ ఆలోచన ఇది అని చెప్పిన సమయంలోనే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జివి ఎల్ వ్యాఖ్యలు దానికి భిన్నంగా ఉంటాయి. ఇక మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి ఒకటి అంటే ఎమ్యెల్సీ సోము వీర్రాజు మరొకరకంగా స్పందించడం గమనార్హం.వచ్చే మునిసిపల్ ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు బీజేపీ రాజమహేంద్రిలో ఒక సమావేశం నిర్వహించింది. దీనికి బీజేపీ నేతలు పురంధరేశ్వరి, పైడికొండల మాణిక్యాల రావు, ఎమ్యెల్సీలు మాధవ్, సోము వీర్రాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి, సోము వీర్రాజు లు పార్టీ కార్యాలయంలోనే విడి విడిగా మీడియా తో మాట్లాడారు. శాసన మండలి రద్దు సరైన నిర్ణయం కాదని పురంధరేశ్వరి స్పందించారు. ఆ తరువాత మాట్లాడిన సోము వీర్రాజు అసలు మండలి వ్యవస్థపై ప్రజల్లో సదాభిప్రాయమే లేదని, అది ఉన్నా లేకపోయినా నష్టం లేదన్నారు. తమ పార్టీ అధిష్టానం నిర్ణయమే తమకు శిరోధార్యమని తమ సొంత అభిప్రాయాలు ఏమి లేవని తేల్చేశారు.గతంలో కూడా మూడు రాజధానుల అంశంపై బీజేపీ లో రచ్చ మొదలైనప్పుడు ఆ పార్టీ ఎపి ఇంచార్జ్ సునీల్ దేవధర్ దాన్ని సామరస్యంగా పరిష్కరించారు. ఎంపీ సుజనా చౌదరి కన్నా లక్ష్మీనారాయణ లు ఒక వాదన, సోము వీర్రాజు, జివిఎల్ నరసింహారావు లది మరో వాదన కావడంతో కమలం లో రెండు మూడు వర్గాలుగా వ్యవహారం సాగి చివరికి పెద్దల జ్యోక్యంతో సెట్ అయ్యింది. తాజాగా ఏపీ లో వేగంగా మారుతున్న రాజకీయాలు, సర్కార్ నిర్ణయాలతో మరోసారి బీజేపీ లో భిన్నస్వరాలు మరోసారి వినిపించడం ఇప్పుడు చర్చనీయం అయ్యింది.
నేతలు తలోదారి
ఏపీ బీజేపీ పుంజుకోవడం మాట అటుంచితే ఇప్పుడున్న పరిస్థితిలో అంతర్గత విభేదాలతో తీవ్రంగా రగిలి పోతోంది. రాష్ట్రంలో బీజేపీ చీఫ్గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన మరో నేత, కేంద్రంలో ఐదు రాష్ట్రాలకు ఇంచార్జ్గా ఉన్న జీవీఎల్కు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నా యని అంటున్నారు. ఏపీ విషయంలో జగన్ను ఇరుకున పెట్టాలని రాష్ట్ర బీజేపీ నేతల వ్యూహం. ఈ క్రమంలోనే కన్నా నోరు తెరిస్తే జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిన్నమొన్నటి వరకు కూడా దీనికి భిన్నంగా జీవీఎల్ వ్యవహరిస్తున్నారు. దీంతో కన్నా వర్సెస్ జీవీఎల్ పోరు సాగుతోందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయం నుంచి ఇంగ్లీష్ మీడియం వరకు కూడా కన్నా లక్ష్మీనారాయణ జగన్ నిర్ణయాలను తీవ్రంగా విభేదించారు. ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, అమరావతిలో రైతుల ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి వారికి మద్దతు కూడా ప్రకటించారు.ఈ పరిణామాలు ఇలా సాగుతున్న క్రమంలోనే జీవీఎల్ బాంబు పేల్చారు. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని చెప్పారు. దీంతో కన్నా హర్ట్ అయ్యారు. అయినా కూడా రాష్ట్ర చీఫ్గా తాను చెప్పిందే ఫైనల్ అంటూ మళ్లీ ప్రకటించారు. దీనిపై జీవీఎల్ కూడా తాను కేంద్రంతో మాట్లాడి చెబుతున్నానని మళ్లీ ఢిల్లీలో స్పష్టం చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ వివాదం రాజకీయ పార్టీల పరిధి దాటి వ్యక్తిగత పట్టుదలల వరకు చేరిపోయింది. అంటే మొత్తంగా చూస్తే రాష్ట్ర బీజేపీలో కన్నాపై జీవీఎల్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని ఓ వర్గం చెవులు కొరుక్కుంది.ఇక, ఇప్పుడు కేంద్రం కూడా ఏపీ విషయంలో కలుగజేసుకునేది లేదని చెప్పేసింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం రాజధాని విషయంలో మరో తీర్మానం చేస్తే దానిని కూడా నోటిఫై చేస్తామని కేంద్రం ప్రకటించింది. సో.. కన్నా లక్ష్మీనారాయణ నోటికి తాళం వేసుకున్నారు. అదే సమయంలో జీవీఎల్ దూకుడును మరింత పెంచుతున్నారు. అయితే, ఇది ప్రచ్ఛన్న యుద్ధంగా మారుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది పెరిగి గ్యాప్ మరింత పెరిగితే కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.