వనపర్తి ఫిబ్రవరి 18, వనపర్తి నియోజకవర్గంలో మంగళవారం నాడు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖిల్లా ఘణపురం మండలం ఈర్లతండా, కర్నెతండాలలో డబల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. పోచారం మాట్లాడుతూ పాలమూరు కరువు తీరా నీళ్లు వచ్చాయి. పొలమున్నా నీళ్లులేని చోటనే పేదరికంవుంటుంది. గత ప్రభుత్వాలు, పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఇన్నాళ్లూ సాగునీరు రాలేదు. ఐదేండ్ల కొకసారి ఓట్లేయించుకుని గెలిచి హైదరాబాద్ లో కూర్చున్నారు. ప్రజల బాధలు తీర్చాలన్న బాధ్యతను మరిచారు. పంట పండితేనే పేదరికం పోతుందని గ్రహించి కేసీఆర్ సహకారంతో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రికార్డు సమయంలో సాగునీళ్లు తేవడం అభినందనీయమని అన్నారు. సీఎం కేసీఆర్ ని ఒప్పించి, మెప్పించి కృష్ణమ్మ నీళ్లు తెచ్చి రైతుల పాదాలు కడిగిన మంత్రి నిరంజన్ రెడ్డి సంకల్పం గొప్పదని ప్రశంసించారు. పంట పండిస్తే రైతుకు కలిగే
ఆనందం ఒకరైతుగా నాకు తెలుసు . కర్నెతండా లిఫ్టు సాధనకు నా సహకారం ఉంటుంది. పెళ్లయినా, ఇళ్లయినా నూరేళ్లపంట .. దానిని సాకారంచేసిన నేత కేసీఆర్ అని అన్నారు. కళ్యాణలక్ష్మితో, డబల్ బెడ్రూం ఇండ్లతో పేదలకు అండగా నిలుస్తున్నారు. పేద గిరిజన యువతి పరిస్థితి చూసి చలించి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దని కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారు. గతంలో పదిమంది పేర్లు రాసుకుని కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు. పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక డబల్ బెడ్రూం ఇండ్లని అన్నారు. దేశంలో ఎక్కడా
డబల్ బెడ్రూం తరహా ఇండ్లను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం లేదు. కేసీఆర్ కిట్ - అమ్మఒడి, ఆసరా పెన్షన్లు దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కలలు నిజం అవుతున్నాయి. అర్హులయిన నిరుపేదలకే డబల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాం. 1400 డబల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. డబల్ బెడ్రూం ఇండ్లు నిర్మించకుండా అడ్డుకున్నారు. స్థలాలు ఎంపికచేస్తే కోర్టులో కేసులువేసి అడ్డుకున్నారు. మరో వెయ్యి ఇండ్ల మంజూరుకు శాసనసభాపతి సహకరించాలని అన్నారు. వరసక్రమంలో అందరికీ ఇండ్లు. ఆలస్యమయిందని అధైర్యపడొద్దు. కర్నెతండా లిఫ్ట్ తో సాగునీరు అందిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో దానిని సాధిస్తామని అన్నారు.