YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో పెద్ద అలజడే రేపుతున్న బొత్స కామెంట్స్

వైసీపీలో పెద్ద అలజడే రేపుతున్న బొత్స కామెంట్స్

వైసీపీలో పెద్ద అలజడే రేపుతున్న బొత్స కామెంట్స్
విజయవాడ, ఫిబ్రవరి 19,
అనుభవం అంటే మంత్రి పదవులు పొందడానికి కాదు, ఎక్కడ ఏమి మాట్లాడాలో కూడా తెలియాలి. ముఖ్యంగా మీడియాతో మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ విధంగా వ్యవహరిస్తున్నారా అంటే కాదనే చెప్పాలి, పైగా బొత్స సత్యనారాయణ రివర్స్ గేర్ వేసి పార్టీ, ప్రభుత్వం పరువు తీస్తున్నారు, కంపు చేస్తున్నారు అని చెప్పాల్సి ఉంటుందని వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ ఈ మధ్య చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇపుడు అధికార పార్టీ వైసీపీలో పెద్ద అలజడే రేపుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో వైసీపీ చేరవచ్చునంటూ బొత్స చేసిన కామెంట్స్ రూలింగ్ పార్టీని మొత్తం సూప్ లో పడేశాయి. జగన్ ఓ వైపు ఢిల్లీలో బిజీగా ఉన్న వేళ బొత్స సత్యనారాయణ విశాఖలో పలికిన శుభ శకునాలు చివరికి అపశకునాలుగా మారిపోయాయి.ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని వ్యూహాలు ఉంటాయి. అవి అమలు అయ్యేంతవరకూ కూడా ఆ సీక్రెట్ అలా మెయింటెయిన్ చేయాలి. అయితే వైసీపీలో మాత్రం బొత్స సత్యనారాయణ ప్రతీ దాన్ని లీక్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అక్కడికి తానేదో పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్లుగా తెగ బిల్డప్ ఇస్తూ ఆయన పెడుతున్న ప్రెస్ మీట్లు సర్కార్ కి ఉచ్చు బిగిస్తున్నాయి. ఇపుడు ఎన్డీయేలో వైసీపీ చేరడం కూడా అలాంటిదే. నిజానికి కొంత నిజం ఉంది, కొంత అబద్దం ఉంది. ముందే చెప్పినట్లుగా మెటీరియలైజ్ అయ్యేంతవరకూ అది అబద్దంగానే ఉంటుంది. ముందే కూసిన కోయిలలా బొత్స సత్యనారాయణ ఈ మాట అనడంతో ఎల్లో మీడియాతో పాటు తమ్ముళ్ళు కూడా వైసీపీని టార్గెట్ చేసారు. దాంతో జగన్ సైతం చిక్కుల్లో పడిపోయారు.బొత్స సత్యనారాయణ నోటి వెంట ఇలా ఆణిముత్యాలు వచ్చాయో లేదో అలా కడప జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం అంజాద్ భాషా గట్టిగా రివర్స్ అయ్యారు. సీఏఏ , ఎన్నార్సీ, ఎన్నార్పీ విషయంలో బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తే తాను మంత్రి పదవినే వదులుకుంటానంటూ భీషణ ప్రతిన పూనారు. అంటే బొత్స సత్యనారాయణ పెట్టిన ఈ మంటతో కోరి మరి కొరివితో తలగోక్కునట్లైంది. మరో వైపు వైసీపీ అధినేత ఢిల్లీ వెళ్ళింది పదవుల రాయబేరాల కోసం తప్ప ప్రజల ప్రయోజనాల కోసం కానే కాదు అని తమ్ముళ్ళూ దీర్ఘాలు తీస్తున్నారు. ఇంకోవైపు అబ్బే పొత్తు లేదు, వైసీపీ మా శత్రువు అంటూ ఏపీ బీజేపీ నేతలు అక్కడికి జగన్ ఏదో తానే బతిమాలుకుంటున్నట్లుగా కలరింగ్ ఇస్తూ పరువు తీస్తున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి కంపు గా మరి ఈ మొత్తం కధ అడ్డం తిరిగింది. దీంతో హైకమాండ్ బొత్స సత్యనారాయణ కు బాగానే క్లాస్ పీకిందని, ఆయన డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఇపుడు అలా అనలేదని నాలిక మడతేస్తున్నారని అంటున్నారు.అప్పట్లో అంటే జగన్ విదేశాలో ఉన్న వేళ అమరావతి రాజధాని మార్చేస్తున్నామంటూ బొత్స సత్యనారాయణ ఇదే మీడియా ముందు చేసిన కామెంట్స్ కూడా ప్రభుత్వాన్ని దారుణంగా ఇరకాటంలో పెట్టాయి. ముఖ్యమంత్రి లేని వేళ సీనియర్లు సక్రమంగా పాలన చూడాల్సిన పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ అలా నోరు జారడంతో నాడే చాలామంది సీనియర్ మంత్రులు ఆయన మీద జగన్ కి ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి. ఇలా తరచుగా బొత్స సత్యనారాయణ సర్కార్ విషయాలను లీక్ చేయడం, సమయం, సందర్భం లేకుండా లూజ్ టంగ్ తో మీడియాకు తాను దొరికి పార్టీని, ప్రభుత్వాన్ని దొరికించేయడం పట్ల జగన్ సైతం సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. మరి ఈ సీనియర్ మంత్రి తరచూ తలబొప్పికట్టిస్తూంటే అధినేత ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలని అంటున్నారు.

Related Posts