YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఒవైసీ స్వరం మారుతోంది..

 ఒవైసీ స్వరం మారుతోంది..

 ఒవైసీ స్వరం మారుతోంది...
విజయవాడ, ఫిబ్రవరి 19,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఓడించి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా టీడీపీతో ఒకే వేదిక పంచుకున్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క పేరున్న నాయకుడు కూడా లేకుండా టీడీపీ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సహా పలువురితో అసదుద్దీన్ ఒవైసీ సభ నిర్వహించారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా మంగళవారం సాయంత్రం విజయవాడలో నిర్వహించిన సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.భారీగా ముస్లింలు పాల్గొన్న ఈ సభలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సీఏఏ, ఎన్ఆర్‌సీలను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌పై కేశినేని ప్రశంసలు గుప్పించారు. ఒవైసీని గత ఆరేళ్లుగా తాను పార్లమెంట్‌లో చూస్తున్నా.. దేశంలో పార్లమెంటేరియన్ అంటే ఇలా ఉండాలనిపించేలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒక మతం పట్ల వివక్ష ప్రదర్శిస్తూ.. సీఏఏ, ఎన్ఆర్సీ తీసుకొస్తున్నారని టీడీపీ ఎంపీ ఆరోపించారు. తాను భారతీయుణ్ని అని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా హించలేదన్నారు.జగన్ సర్కారు కూడా కేరళ, తెలంగాణ తరహాలోనే సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. దానికి టీడీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతారని వ్యాఖ్యానించారు. సీఏఏను సవాల్ చేస్తూ.. జగన్ పిటిషన్ దాఖలు చేయాలన్నారు. లేదంటే తానే పిటిషన్ వేస్తానని కేశినేని నాని వ్యాఖ్యానించారు.తెలంగాణ కేబినెట్ సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా తీర్మానించిందని, ఏపీ ప్రభుత్వం కూడా ఇలాగే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు కూడా భయకుండా బయటకు వచ్చి.. ప్రధాని మోదీ, అమిత్ షాపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. మోదీ, షాలు దేశాన్ని మత ప్రాతిపదిక విభజించాలని చూస్తున్నారని విమర్శించారు. వారి చర్యలకు తెలుగు రాష్ట్రాల నాయకులు అడ్డుకట్టవేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒవైసీ టీడీపీ ఎంపీ కేశినేని నానిపై పొగడ్తల వర్షం కురిపించారు.2019 ఎన్నికల సమయంలో టీడీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన అసదుద్దీన్ ఒవైసీ.. ముస్లింలందరూ వైసీపీకి అండగా నిలబడాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. కానీ, ప్రస్తుతం మాత్రం వైసీపీకి ఆ స్థాయిలో మద్దతు ప్రకటించట్లేదు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం పెట్టాల్సిందేనని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరిన ఒవైసీ కేసీఆర్ చేయగానే, నేరుగా విజయవాడలోనే సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కూడా స్వరం తగ్గించి మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో ముస్లింలు గుంపుగుత్తగా వైసీపీకి మద్దతుగా నిలిచారు. అయితే ప్రస్తుతం సీఏఏ, ఎన్ఆర్‌సీ విషయంలో వైసీపీ పూర్తి ఆత్మరక్షణలో పడినట్లే కనిపిస్తోంది. ఇటీవలే వైసీపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సైతం అవగాహన లేకనే పార్లమెంటులో సీఏఏ, ఎన్ఆర్‌సీకి మద్దతిచ్చినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని మాత్రం ఎంతో చొరవగా సీఏఏ, ఎన్ఆర్‌సీ ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పలు ర్యాలీల్లో పాల్గొన్న.. రెండు రోజుల క్రితం సీఎం జగన్ ఇలాకా కడపకు వెళ్లి మరీ బలంగా తన బాణీ వినిపించారు. ఏపీ తరఫున 25 మంది ఎంపీల్లో తానొక్కడినే పార్లమెంటులో సీఏఏకి వ్యతిరేకంగా నిలిచినట్లు చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.సీఏఏ ర్యాలీల విషయమై ఎంపీ నాని దూకుడుగా దుకెళ్తుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ముస్లింలకు నాని మరింత దగ్గరైతే అంతిమంగా అది పార్టీకే మేలు చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిశారు. దీంతో కేంద్రంలో వైసీపీ చేరబోతోందంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు నెలకొన్నాయి. మీడియాలో సైతం ప్రముఖంగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో రాష్ట్రంలో సీఏఏ వ్యతిరేక ర్యాలీలు హోరెత్తాయి.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఇప్పుడున్న ఫార్మాట్ ప్రకారమైతే రాష్ట్రంలో ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్ అమలు చేయబోమని చెప్పారు. అయితే సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ ముస్లింల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి ప్రజానీకంలో నెలకొంది. టీడీపీ నాయకులు, ఒవైసీ ఒకే వేదికను పంచుకోవడం నూతన పరిణామం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts