తలసాని వ్యాఖ్యలకు పీయూష్ గోయల్ ధీటైన కౌంటర్
హైదరాబాద్, ఫిబ్రవరి 18
దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందంటూ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. మెట్రో ప్రారంభోత్సవానికి తనను పిలవలేదంటూ కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించిన తలసాని.. తన నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న రైల్వే కార్యక్రమానికి తనను కూడా ఆహ్వానించలేదని కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే రైల్వే మంత్రి తెలంగాణను కూడా పట్టించుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పీయూష్ ఘాటుగా స్పందించారు. గడిచిన ఐదేళ్లలో తెలంగాణ కేటాయింపులను తెలుసుకోవాలని చురకలంటించారు. కేటాయింపులకు సంబంధించిన బుక్లెట్ను చదవాలని తలసానికి సూచించారు. గత ప్రభుత్వాలు తెలంగాణకు రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. ప్రస్తుతం రూ. 2,602 కోట్లు తెలంగాణకు కేటాయించడం జరిగిందని పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు.