బోస్ కు పదవి ఖాయమేనా
ఏలూరు, ఫిబ్రవరి 22,
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం రేపో మాపో ఆచరణలోకి రానుంది. కేంద్రం కూడా జగన్ నిర్ణయానికి ఓటేసినట్టు తెలుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకు రాజకీయ పునరావాస కేంద్రంగా ఉన్న శాసన మండలి త్వరలోనే రద్దు కానుంది. దీనిని రద్దు చేయడం ద్వారా ప్రజలు తనకు ఇచ్చిన భారీ మెజారిటీ సత్తా ఎంటో నిరూపించాలని జగన్ చేస్తున్న ప్రయత్నానికి మెజారిటీ ప్రజలు కూడా ఓకే చెబుతున్నారు. ఇప్పటికే మండలి రద్దు తీర్మానం కేంద్రానికి చేరడం, అక్కడ కూడా జగన్కు సానుకూల పవనాలు వస్తుండడంతో త్వరలోనే మండలి రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది.ఇదిలా వుంటే, జగన్ కేబినెట్లో ఇద్దరు మంత్రులు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరిలో మత్య్సకార సామాజకి వర్గానికి చెందిన మోపిదేవి వెంకట రమణ, శెట్టిబలిజ కమ్యూనిటీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్. ఇద్దరూ కూడా జగన్కు ఆప్తులే. అంతేకాదు, జగన్ తండ్రి వైఎస్ హయాంలోనూ ఇద్దరూ ఆయనకు మంచి సన్నిహితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఈ ఇద్దరూ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.మండపేట నుంచి పోటీ చేసిన బోస్, రేపల్లె నుంచి పోటీ చేసిన మోపిదేవి ఈ ప్రభంజనంలో కూడా ఓడిపోయారు. బోస్కు ఎన్నికల ముందే ఆయన కోరుకున్న సొంత సీటు రామచంద్రాపురం కాదని మరీ జగన్ మండపేటకు పంపారు. ఇక రేపల్లెలో మోపిదేవి వరుసగా రెండోసారి ఓడిపోయారు. అయినా జగన్ వీరికి మండలిలో పదవులు ఇచ్చి తన కేబినెట్లోకి తీసుకున్నారు. అయితే, ఇప్పుడు మండలి రద్దుతో ఈ ఇద్దరి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, జగన్ తీసుకున్నట్టు ప్రచారం అవుతున్న తాజా నిర్ణయం వల్ల మోపిదేవి సేఫ్ అనే మాట వినిపి స్తోంది. త్వరలోనే నాలుగు రాజ్యసభ సీట్లు జగన్ పార్టీ దక్కనున్నాయి. ఈ నలుగురిలో ఒక సీటును మోపిదేవికి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.దీంతో మండలి రద్దయినా మోపిదేవి రాజ్యసభకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరి బోస్ పరిస్థితి ఏంటి? ఆయనకు మండలి రద్దయితే జగన్ ఎలాంటి పదవి ఇవ్వనున్నారు? అనే ప్రశ్న వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం నాలుగు జోన్లను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కోస్టల్ కృష్ణా రీజియన్కు చైర్మన్గా బోస్ను నియమిస్తారని అంటున్నారు. ఇది కూడా కేబినెట్ ర్యాంకుండే పదవే కావడంతో బోస్ను ఈ విధంగా సంతృప్తి పరచాలని జగన్ నిర్ణయించుకున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.