అమరావతి పేరే లేకుండా ప్రతిపాదనలు?
తుళ్లూరు మండలంలోని గ్రామాలన్నింటిని కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు
అమరావతి ఫిబ్రవరి 22
అమరావతి రాజధానిగా ఉండటం పక్కన పెట్టండి అసలు ఆ ప్రాంతానికి అమరావతి పేరే లేకుండా ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు సమాచారం. తుళ్లూరు మండలంలోని గ్రామాలన్నింటిని కలిపి తుళ్లూరు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే తాడేపల్లి, మంగళగిరి మండల పరిధిలోని గ్రామాలను స్థానిక పురపాలక సంస్థల్లో కలుపుతున్నట్లు ప్రకటించారు.గతంలో తుళ్లూరు మండలంలో కొన్ని గ్రామాలను రాజధాని పరిధి నుండి మినహాయించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే మున్సిపాలిటీలో వాటిని కలపనున్నారు. ఇటీవల స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే చర్చ మొదలైన అనంతరం రాజధాని పరిధిలోని గ్రామాలన్నీ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు.అదే సమయంలో రాజధాని పరిధిలోకి వచ్చిన తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని గ్రామాలను మాస్టర్ప్లాను నుండి విడదీసి కొత్తగా ఏర్పాటు చేయనున్న మున్సిపాలిటీల పరిధిలో కలిపేశారు. దీంతో రాజధాని పరిధి నామమాత్రంగా మారింది. తాజాగా తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాలన్నీంటిని కలిపి మున్సిపాలిటీ ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.