లింగ సమానత్వం తోనే సంపూర్ణ వికాసం ప్రధాని మోదీ
న్యూఢిల్లీ ఫిబ్రవరి 22
చట్టమనేది రాజులకే రారాజు.. చట్టమే అత్యున్నతమైనది అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశానికి న్యాయ వ్యవస్థనే సుప్రీం అని ఆయన స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన న్యాయనిపుణులకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను 130 కోట్ల మంది భారతీయులు అంగీకరించారని మోదీ తెలిపారు. మహాత్మాగాంధీ న్యాయవాది.. గాంధీ ఆచరించిన మార్గంతో న్యాయవ్యవస్థకు పునాది వేశారు.మహాత్మాగాంధీ తన జీవితాన్ని సత్యం, సేవా మార్గంలో కొనసాగించారు. గాంధీజీ తన ఆత్మకథలో, తన జీవితంలో పోరాడిన మొదటి దావా గురించి రాశారు అని మోదీ గుర్తు చేశారు.ప్రపంచం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది అని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో సంక్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి న్యాయవ్యవస్థ కృషి చేస్తోంది. నిరంతరం అధ్యయనంతోనే కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. వ్యవస్థలో మార్పులు హేతుబద్ధంగా, చట్ట ప్రకారం ఉండాలి. భారతదేశ శాసన, న్యాయశాఖలు పరస్పరం గౌరవించుకుంటాయి. 70 ఏళ్ల భారత రాజకీయ వ్యవస్థలో మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించాం. మహిళలకు ఓటు హక్కు కల్పించిన ప్రముఖ దేశాల్లో భారత్ ఒకటి అని మోదీ పేర్కొన్నారు. 135 కోట్ల మంది భారతీయులు తమ సమస్యలను న్యాయవ్యవస్థ ద్వారానే పరిష్కరించుకుంటున్నారు. లింగ సమానత్వం లేనిది సంపూర్ణ వికాసం ఉండదన్నారు మోదీ. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కేవలం లాయర్ల డాక్యుమెంట్ మాత్రమే కాదు.. అది అందరి జీవితాలకు మార్గదర్శకం అని అన్నారు. దేశంలో పర్యావరణ పరిరక్షణకు సుప్రీం తన తీర్పులతో ఎంతో సహకరించిందన్నారు. మారుతున్న సాంకేతికతను న్యాయవ్యవస్థ అందిపుచ్చుకోవాలి అని మోదీ సూచించారు.