పొంగులేటికి కన్ఫార్మ్ చేసేశారు...
ఖమ్మం, ఫిబ్రవరి 25
తెలంగాణలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కబోతున్నాయనేది ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం కారణంగా రెండు సీట్లు ఆ పార్టీ ఖాతాలోనే పడనున్నాయి. ఉన్నవి రెండు సీట్లే అయినా ఆశావహులు మాత్రం చాలా మందే ఉన్నారు. దీంతో అధినేత కేసీఆర్ ఎవరిని కనుకరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేసీఆర్ ఎవరిని రాజ్యసభకు పంపించాలనే అంశంపై ఒక క్లారిటీకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.ఇందులో ఒక సీటు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దక్కడం ఖాయంగా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన చేరికతో ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి బలం పెరిగింది. అయితే, జిల్లా టీఆర్ఎస్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గాలు ఉన్నాయి. రెండు వర్గాలకు పడకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో కేసీఆర్కు పొంగులేటి, తుమ్మలపై కోపం వచ్చింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయినా పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి టిక్కెట్ ఇవ్వకుండా పక్కనపెట్టారు. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బలమైన అభ్యర్థి అని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు పట్టుందని కేసీఆర్కు తెలుసు. అయినా టిక్కెట్ ఇవ్వకుండా నామా నాగేశ్వరరావుకు టిక్కెట్ ఇచ్చి పొంగులేటికి పనిష్మెంట్ ఇచ్చారు. అయితే, ఆయన పార్టీలోనే కొనసాగుతూ నామా విజయానికి కృషి చేశారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి పదవీ లేకపోయినా జిల్లాలో హల్ చల్ చేస్తున్నారు.లోక్సభ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వనప్పుడే ఆయనకు రాజ్యసభ ఇస్తామని టీఆర్ఎస్ పెద్దలు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ హామీ మేరకు ఆయనను ఇప్పుడు రాజ్యసభకు పంపించడం ఖాయమే. ఇక, మిగతా ఒక సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే రాజ్యసభ సభ్యత్వం ముగిస్తుంది. ఇప్పుడు ఆయనకు రెనివల్ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నందున తనకు సన్నిహితంగా ఉండే కేకేకు మళ్లీ రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.మరోవైపు మాజీ స్పీకర్ మధుసుదనాచారి పేరు కూడా ఇటీవల వినిపిస్తోంది. మధుసుదనాచారి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ వెంట నడిచారు.2014లో ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చి మంచి గుర్తింపు ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు భూపాలపల్లిలో ఆయనపై గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకోవడంతో పార్టీలో, నియోజకవర్గంలో మధుసుదనాచారి నామమాత్రంగా మారిపోయారు. దీంతో తనను రాజ్యసభ అవకాశం కల్పించాలని ఆయన కేసీఆర్కు కోరినట్లు తెలుస్తోంది.మరోవైపు కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తుంది. అయితే, ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపిస్తే బాగుండదనే ఆలోచన కూడా పార్టీలో ఉన్నట్లు చెబుతున్నారు.పైగా రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించే కవితను ఒక్క ఓటమికే వెనకడుగు వేసి రాజ్యసభకు పంపిస్తే కవిత రాజకీయ జీవితానికి ఇబ్బందిగా మారవచ్చు. అందుకే ఇప్పుడే కవితను రాజ్యసభకు పంపించే
అవకాశాలు తక్కువే అంటున్నారు.