YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఢిల్లీలో పతాక స్థాయికి సీఏఏ ఆందోళనలు

ఢిల్లీలో పతాక స్థాయికి సీఏఏ ఆందోళనలు

ఢిల్లీలో పతాక స్థాయికి సీఏఏ ఆందోళనలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోన్న సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మంగళవారం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతిచెందినవారి సంఖ్య ఏడుకు చేరింది. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్‌, చాంద్‌బాగ్, భజాన్‌పుర, కరాడమ్‌పురి, కజౌరి, కర్వాల్ నగర్ జఫ్రాబాద్‌, గోకుల్‌పురిలో ప్రాంతాల్లో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులు స్థానిక ఇళ్లకు, వాహనాలకు సోమవారం నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నాయి. సోమవారం సాయంత్రం జరిగిన రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాత మరో ఆరుగురు పౌరులు మృతిచెందారు.ఇరువర్గాల ఘర్షణలో కనీసం 60 మంది పోలీసులు సహా పౌరులు గాయపడ్డారు. డీసీపీ అమిత్‌ శర్మకు సైతం గాయాలయ్యాయి. పరిస్థితి చేజారడంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది ఈ దాడుల్లో గాయపడినట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో మండీ హౌస్, ఐటీఓ, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్‌‌ల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ గేట్‌లను అధికారులు మూసివేశారు. ఈ ఘటనపై మాజీ సమాచార కమిషనర్ వజాహత్ హబీబుల్లా, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం నాటి హింసకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాలని కోరారు. ఢిల్లీ హింసపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ సహా వివిధ రాజకీయ పార్టీల నేతలలో సమావేశానికి పిలుపునిచ్చారు.మరోవైపు, ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో పోలీసులపై కాల్పులకు తెగబడిన మహమూద్ షారుఖ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కానిస్టేబుల్ తలపై తుపాకీ గురిపెట్టినట్టు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి  వ్యతిరేకంగా ఆందోళనకారులు కొద్ది రోజులుగా జఫ్రాబాద్, మౌజ్‌పూర్, షహీన్‌బాగ్ వంటి ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 500 మందికి పైగా  ఆందోళనకారులు షాహీన్‌బాగ్ తరహాలోనే జఫ్రాబాద్ మెట్రో రైల్వేస్టేషన్ సముదాయం కింద శనివారం అర్ధరాత్రి నుంచి ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సీఏఏకి అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసి ఒకరిపై ఒకరు రాళ్లదాడులకు తెగబడ్డారు.

Related Posts