ఇక సరోగసీ..ఈజీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27
సరోగసి క్రమబద్థీకరణ బిల్లు 2020ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సరోగసీ చట్టం క్రమబద్థీకరణతో సరోగేట్ తల్లి సమీప బంధువే అయి ఉండాల్సిన అవసరం లేదు. సరోగేట్కు మారేందుకు సమ్మతించే మహిళ ఎవరికైనా ఈ సరోగసీ అవకాశం కల్పిస్తారు. సరోగసీ ప్రక్రియలో చేపట్టిన మార్పులు చేర్పులతో సరోగసీకి వితంతువులు, విడాకులు పొందిన ఒంటరి మహిళలు కూడా సరోగేట్ తల్లులు కావచ్చు. చట్టపరమైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ క్రమబద్థీకరణ బిల్లు తీసుకువచ్చారు. ఇక సంతానం లేని భారతీయ దంపతులకు ఈ ప్రక్రియతో ఎంచుకునే సరోగేట్ లభించడం తేలిక అవుతుంది. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సిఫార్సులన్నింటినీ ఈ బిల్లులో పొందుపర్చినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ భేటీ తెలిపారు ముసాయిదా బిల్లు ప్రతిని సెలెక్ట్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. దేశంలో సరోగసీలో వాణిజ్య ధోరణులు అరికట్టేందుకు, సంతానలేమి వారిపట్ల ఇతరులు ఔదార్యతను చాటుకునేందుకు వీలుగా ఈ బిల్లు క్రమబద్థీకరణ జరిగినట్లు మంత్రులు వివరించారు. దంపతులు ఇద్దరూ భారతీయులు అయి ఉంటేనే ఈ విధంగా సరోగసీకి వెళ్లేందుకు వీలుంటుందని ఇరానీ తెలిపారు. మహిళల సంతాన హక్కులు, పునరుత్పత్తి విషయాలపై ప్రధాని మోడీ ఔదార్య వైఖరిని ప్రదర్శించారని, చట్టపరమైన కట్టుబాట్ల సంక్లిష్టతలు లేకుండా చూశారని మంత్రి తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలోనే తగు బిల్లుకు రూపకల్పన జరిగిందని వివరించారు. 2019లో లోక్సభ ఆమోదం పొందిన బిల్లుకు ఎగువ సభ సెలెక్ట్ కమిటీ తగు సవరణలతో కూడిన సిఫార్సులు వెలువరించింది. వీటిని దృష్టిలో పెట్టుకుని బిల్లును తగు విధంగా రూపొందించినట్లు మంత్రులు వివరించారు. వచ్చే నెలలో తిరిగి మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ విరామానంతర సమావేశాలలో ఈ సవరించిన బిల్లును ఆమోదానికి ప్రవేశపెడుతారు. సరోగసీని క్రమబద్థీకరించే దిశలో సరైన వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. ఇందులో భాగంగా జాతీయ సరోగసీ బోర్డు కేంద్రస్థాయిలోనూ, రాష్ట్రాలవారిగా వేర్వేరుగానూ సరోగసీ మండళ్లు ఉంటాయి. ఇక సరోగేట్ తల్లికి ఇప్పుడున్న ఇన్సూరెన్స్ పరిధి 16 నెలలను 36 నెలలుగా పెంచారు. ఇదే క్రమంలో సరోగసీ వాణిజ్య ధోరణులు, తద్వారా తలెత్తే అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీవ్రతరం చేయాలని సంకల్పించారు.