కుటుంబసభ్యుల వైపు... తెలుగు పార్టీల చూపు
హైద్రాబాద్, ఫిబ్రవరి 27
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రకమైన రాజకీయం సాగుతోంది. కాకపోతే అక్కడ కేసీఆర్ రాజకీయంగా అనుభవం కలిగిన వారు. ఇక్కడ జగన్ ఇంకా నిలదొక్కుకుంటున్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ కూడా కుటుంబ సభ్యుల అండదండలతో బాగానే రాణిస్తున్నారు కేసీఆర్ మొదట్లో ఒంటరిగానే పాలిట్రిక్స్ చేసినా ఉద్యమ కాలంలో ఒక్కసారిగా కొడుకూ, కూతురూ వచ్చేశారు. వారు అలా రావడం కూడా నాడు అవసరం పడింది. ఇక మేనల్లుడు హరీష్ రావు ఉండనే ఉన్నాడు. దాంతో కేసీఆర్ ఫ్యామిలీ అంటేనే టీఆర్ఎస్ గా తయారైంది.తనకు తండ్రి వైఎస్సార్ అతి పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని నల్లకాలువ వద్ద జరిగిన సభలో జగన్ తొలిసారి చెప్పుకున్నారు ఆ కుటుంబం కోసం తాను ఉన్నానని బయల్దేరిన జగన్ తరువాత కాలంలో తన తల్లిని, చెల్లినీ కూడా వెంటబెట్టుకువచ్చారు. జగన్ జైలులో ఉన్నపుడు విజయమ్మ రాజకీయంగా చురుకుగా ఉన్నారు.ఆమెకు తోడుగా, జగనన్న బాణంగా షర్మిల కూడా రాజకీయాల్లో కీలకమైన భూమికను పోషించారు. ఇపుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఎన్నికల వేళ ఆయనకు చేరో వైపు సాయంగా చెల్లి, తల్లి గట్టిగా ప్రచారం చేసి పెట్టారు. తల్లి విజయమ్మ వరకూ చూసుకుంటే ఒకసారి పులివెందుల ఎమ్మెల్యేగా నెగ్గారు, ఇక 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాలను మానుకున్నారు.ఇక జగన్ తన చెల్లెలు షర్మిలకు న్యాయం చేయలేదన్న మాట పార్టీలోనూ వినిపిస్తోంది. అవకాశం వస్తే ఇదే అంశాన్ని పెద్దది చేసే టీడీపీ కూడా ఉంది. జగన్ కి సొంత చెల్లెలు అంటే కూడా పడదు, ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని తమ్ముళ్ళు తంటాయే పెడుతున్నారు. ఎవరినీ ఎపుడూ నమ్మని జగన్ అందుకే షర్మిలకు పదవులు ఇవ్వకుండా దూరం పెడుతున్నారని హాట్ కామెంట్స్ చాలా సార్లు టీడీపీ చేసింది. మరి పదవులు ఇస్తే కుటుంబ పాలన అనేందుకు కూడా రెడీగా ఉంది. ఎవరెన్ని అన్నా కూడా జగన్ తన చెల్లెలికి ఈసారి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం అయితే ఉంది. ఢిల్లీ రాజకీయాల్లో జగన్ కి కుడిభుజంగా విజయసాయిరెడ్డి ఉంటున్నారు. ఆయన ఎంత సమర్ధుడైనా కూడా సొంత ఇంటి మనిషి ఉండడం కూడా అవసరమే. దాంతో జగన్ తనకు రాజ్యసభ ద్వారా వచ్చే నాలుగు సీట్లో ఒకటి షర్మిలకు కేటాయించాలనుకుంటున్నారుట.మరో వైపు కేసీఆర్ తన ముద్దుల కూతురు కవిత విషయంలో బెంగటిల్లుతున్నారు. ఏ పదవీ లేకుండా కుమార్తె ఉండడాన్ని అసలు తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఈసారి తెలంగాణా నుంచి వచ్చే రెండు సీట్లలో ఒకటి కచ్చితంగా కవితకు ఇవ్వాలనుకుంటున్నారుట. కేసీయార్ ది వేరే బాధ. పైగా ఆయన ఢిల్లీ రాజకీయాలు చేయాలని పరితపిస్తున్నారు. గతంలో అయితే ఎంపీగా కవిత ఉండేది. ఇపుడు ఓడిపోయి తెలంగాణాకే పరిమితం కావడంతో ఆమెను ఢిల్లీ పంపి తన భవిష్యత్తు రాజకీయానికి బాటలు వేస్తుకోవాలని ఆలోచనలు చేస్తున్నారుట. దాంతో అటు కవిత, ఇటు షర్మిల ఈసారి పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు.