సీరియల్ కిల్లర్ జాల్లీ ఆత్మహత్యాయత్నం
కోజికోడ్ ఫిబ్రవరి 27,
కేరళ, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ జాల్లీ షాజూ జోసెఫ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం కోజికోడ్ జైలులో ఉన్న ఆమె గురువారం ఉదయం చేతిని కోసుకుంది. దీంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం జాల్లీ ని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి నిలకడగా వుంది. తెల్లవారుజామున జాల్లీ మణికట్టును కోసుకోవడాన్ని జైలు బ్యారక్ లో వున్న ముగ్గురు రిమాండ్ ఖైదీలు చూసి జైలు అధికారులను అప్రమత్తం చేసారు. ఆస్తి కోసం 14 ఏళ్ల వ్యవధిలో సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని జాల్లీ హతమార్చింది. అంతేకాకుండా కట్టుకున్న భర్త రాయ్ థామస్ను కూడా ఆమె దారుణంగా హతమార్చి, ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు కట్టుకథ అల్లింది. అయితే కుటుంబసభ్యులు వరుసగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో రాయ్ థామస్ సోదరుడు రోజోకు అనుమానం వచ్చింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసు దర్యాప్తులో జాల్లీ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. బంధువులు, ఇరుగుపొరుగు వున్న వాళ్లు నివ్వెరపోయారు. జాల్లీ భర్త రాయ్ థామస్ సైనైడ్ ప్రయోగంతో చనిపోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మిగతా ఐదుగురి మరణాలపై పోలీసులు దర్యాప్తును కొనసాగించగా వారుకూడా సైనైడ్ ప్రయోగంతోనే ప్రాణాలు విడిచారని నిర్దారించారు. మృతులందరికి సూపులో సైనైడ్ కలిపి ఇచ్చినట్లు గుర్తించారు. మృతుల్లో జాల్లీ రెండవ భర్త మొదటి భార్య, రెండెళ్ల కూతురు కుడా వున్నారు. చివరకు పోలీసులు జాల్లీ ని విచారించగా ఒక్కొక్కటిగా ఆమె అరాచకాలు బయటపడ్డాయి. దీంతో జాల్లీ తో పాటు ఆమె రెండో భర్త షాజూను పోలీసులు అరెస్ట్ చేశారు