రేవంత్ ఇరుక్కున్నట్టేనా
హైద్రాబాద్, ఫిబ్రవరి 28
మూడు రోజులుగా తెలంగాణ రాజకీయాలలో నానుతున్న వ్యవహారాలలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి భూదందా వ్యవాహారం అనేది కూడా ఒకటి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్ 127లో 10.21 ఎకరాల పట్టా భూమి ఉండగా, అందులో 6 ఎకరాల 7 గుంటల భూమిని రేవంత్ రెడ్డి కాజేశారన్నది ఆయనపై వస్తున్న ఆరోపణ.రేవంత్ ఆయన సోదరుడు కొండల్ రెడ్డితో కలసి తప్పుడు పత్రాలతో అత్యంత ఖరీదైన భూమిని తమ పేరిట మ్యుటేషన్ చేయించుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ విచారణలో తేలింది. రేవంత్రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ.. అనిల్ కుమార్ అనే వ్యక్తి 2015లో రంగారెడ్డి సివిల్ కోర్టులో.. కొల్లా అరుణ 2017లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్లన్నీ ఇప్పుడు విచారణకు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ మేరకు సీఎస్కు నివేదిక సమర్పించారు. తప్పుడు పత్రాలతో రేవంత్రెడ్డి, కొండల్రెడ్డి భూమిని నొక్కేశారని తేలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ మ్యుటేషన్ చేసిన అప్పటి డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.అయితే, బుధవారం దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వం తనపై టార్గెట్ చేసి చేస్తుందని ఆరోపించారు. తప్పుడు పత్రాలతో చేసానని తేలిందని ప్రభుత్వం చెప్తున్న ఆ భూమి రిజిస్ట్రేషన్ జరిగిన సమయానికి తనకు ఆరు సంవత్సరాల వయసని రేవంత్ చెప్పడం విశేషం.ఇలాంటి బెదిరింపులకు.. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే రకం తాను కాదని రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఒకపక్క ప్రభుత్వం మొదలుపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కౌంటర్ గా రేవంత్ పట్నం గోస కార్యక్రమం మొదలుపెట్టారు. గత రెండు రోజులుగా తన పార్లమెంట్ నియోజకవర్గంలో రేవంత్ బస్తీ బాట పట్టారు.మరోపక్క తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పు జరగనుండగా రేవంత్ రెడ్డిని అది వరించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలో ఎప్పటివో కేసులు ఇప్పుడు తెరపైకి తేవడం ఆసక్తిగా మారింది. ఒకపక్క అధికార పార్టీ.. మరోపక్క సొంత పార్టీ కలిసి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుందని అయన అభిమానుల వాదన. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.