నాలుగు లక్ష్యాలతో జగన్ ప్లాన్
విజయవాడ, ఫిబ్రవరి 29
అప్రతిహత విజయంతో ఏపీలో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న వైసీపీ అధినేత జగన్కు అప్పుడే పది నెలల సమయం పూర్తవుతోంది. ఇక, ఆయనకు అధికారంలో మిగిలేది మరో నాలుగేళ్లు మాత్రమే. ఈ నాలుగేళ్లలోనూ చివరి ఏడాది ఆరు మాసాలు ఎన్నికల వ్యూహం ఉంటుంది కాబట్టి దీనిని పెద్దగా లెక్కించే అవకాశం ఉండదు. దీంతో రమారమి జగన్కు ఉన్న సమయం కేవలం మూడున్నర ఏళ్లు మాత్రమే. ఈ సమయంలో చిన్నదైనా పెద్దదైనా జగన్ ప్రభుత్వం ముందు చాలా కీలకమైన లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పేదలను, రైతులను మురిపించే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు.వీటి వల్ల మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? చేసే అవకాశం ఉంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి రీజన్ కూడా కళ్లముందే కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అమలు చేశారు. ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ పేరుతో డబ్బులు వెదజల్లారు. అయినా కూడా ప్రజలు ఆయనను గెలిపించలేదు. సో సంక్షేమ కార్యక్రమాలు అన్నివేళలా సక్సెస్ అవుతాయని చెప్పలేం.ఈ క్రమంలో మెజారిటీ ప్రజలను మెప్పించేందుకు రాష్ట్రంలో కీలకమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వీటిలో ఎన్నింటినో భుజాలకు ఎత్తుకోవాల్సిన అవసరం కూడాలేదు. కేవలం రెండు ప్రాజెక్టులు పోలవరం, వెలిగొండలను పూర్తి చేస్తే జగన్ పేరు రైతుల గుండెల్లో నిలిచిపోతుంది. అదే సమయంలో రాజధాని విషయాన్ని స్పష్టం చేసి ఒక రూపం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.ఓ నాలుగు కీలక కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేలా వ్యూహం వేస్తే.. ఉపాధి కల్పన జరిగి యువతలోను జగన్ పేరు నిలిచిపోతుంది. ఇక, ప్రత్యేక హోదా విషయంలో తన తప్పు లేదని అంటున్నా.. 22 మంది ఎంపీలను ఇచ్చారు కాబట్టి జనం మదిలో ఈ విషయం ఎప్పటికీ హాట్ టాపిక్గానే ఉంటుంది. ఈ విషయంలోనూ జగన్ శ్రమించక తప్పదు. మరి ఈ నాలుగు లక్ష్యాలను ఛేదిస్తే.. మళ్లీ జగన్కు మంచి అవకాశాలు ఉండే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.