రాజ్యసభ రేసు తెరపైకి వస్తున్న త్యాగయ్యలు
కాకినాడ, మార్చి 2
రాజసభ్య రేసుకు సంబంధించి ప్రకటన వచ్చిందో లేదో.. అలా నాయకులు పుట్టల్లోని పాముల మాదిరిగా బయటకు వచ్చేశారు. మాకు అప్పుడు జగన్ హామీ ఇచ్చారు. మాకు ఇప్పుడు టికెట్ ఇవ్వాలి. మాకు అప్పుడు ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు సో.. ఇప్పుడు కరుణించాలి. మేం త్యాగాలు చేశాం.. జగన్ను సీఎం ను చేశాం.. కాబట్టి మాకే టికెట్ ఇవ్వాలంటూ నాయకులు మీడియాకు లీకులిస్తున్నారు. కొందరు జగన్ను నేరుగా కలిసి అభ్యర్థించేందుకు కూడా రెడీ అయ్యారు. అయితే, మరికొందరు మీడియా ద్వారా తమ మనసుల్లోని మాటలను చెప్పుకొస్తున్నారు.మొత్తంగా రాజ్యసభ సీట్ల సంగతి వైసీపీలో తీవ్ర చర్చకు, నాయకుల మధ్య తీవ్ర ఉత్కంఠకు కూడా దారితీ స్తోంది. ఈ క్రమంలో ఎవరెవరు ఎలా ఉన్నప్పటికీ ఎస్సీ వర్గానికి చెందిన నాయకులు కూడా ఈ రేసులో ఉండడం ఆసక్తిగా మారింది. అమలాపురం మాజీ ఎంపీ, టీడీపీ మాజీ నాయకుడు పండుల రవీంద్ర రాజ్యసభ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. తనపేరు పరిగణనలోకి తీసుకోవాలంటూ.. ఆయన ఇప్పటికే జగన్ను అభ్యర్థించినట్టు ఆయన అనుచరులు మీడియాకు లీకులు ఇస్తున్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు కూడా టీడీపీలో ఉన్న పండుల అమలాపురం టికెట్ను ఇవ్వకపోవడంతో పార్టీకి దూరమై వైసీపీలో చేరిపోయారు.టీడీపీలో ఆయనకు సీటు రాదన్న విషయం ముందుగానే గ్రహించే ఆయన వైసీపీలోకి జంప్ చేసేశారు. అయితే, వైసీపీలోనూ ఆయనకు టికెట్ లభించలేదు. జగన్ ఆ సీటును చింతా అనూరాధకు ఇవ్వగా ఆమె అమలాపురం ఎంపీగా పండుల రవీంద్ర విజయం సాధించారు. దీంతో అప్పటి నుంచి మౌనం పాటిస్తున్నారు. ఇక, ఇప్పుడు అనూహ్యంగా తెరమీదికి వచ్చారు. రాజ్యసభ రేసులో వైసీపీకి నాలుగు సీట్లు దక్కనున్న నేపథ్యంలో ఎస్సీ కోటాకు ఒక సీటును కేటాయించాలని జగన్ నిర్ణయించారు. దీంతో ఆ సీటు తనకే దక్కుతుందని పండుల రవీంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన జగన్ అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన మంత్రి అవంతి సాయం తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. ఇద్దరూ కలిసే గత ఏడాది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి జగన్ పండుల కల నెరవేరుస్తారా ? లేదా ? అనేది వేచి చూడాలి.