రాజధానులపై అందరికంటే ముందు లీక్స్ ఇచ్చింది మంత్రి బొత్స!
అమరావతి మార్చ్ 2
పలు దేశాలు రహస్యంగా చేయబోయే పనులు చేసిన వాటిని ప్రపంచానికి బయటపెట్టి సంచలనం సృష్టించిన వికీలీక్స్ ఎలాగో.. ఏపీకి ఇప్పుడు ‘బొత్స లీక్స్’ అలాగే మారిపోయింది.అమరావతి రాజధాని మార్పు మూడు రాజధానులపై మొట్టమొదట అందరికంటే ముందు లీక్స్ ఇచ్చింది మంత్రి బొత్స సత్యనారాయణ కావడం విశేషం. సీఎం జగన్ వైసీపీ అధిష్టానం ఏ పని చేయాలనుకున్నా మొదట బొత్సతోనే దాన్ని జనబాహుల్యంలోకి తీసుకెళుతున్నారు.బొత్స ఏదైనా మాట అన్నాడంటే ఇప్పుడు ఏపీలో జరిగి తీరుతుందన్నమాట.. అమరావతి మార్చుతున్నామని బొత్స అన్నారు. సీఎం జగన్ చేసేశారు. ఇక విశాఖ రాజధానిని బొత్స చేస్తామన్నారు. జగన్ బిల్లు పెట్టి పాస్ చేయించారు. ఇక లోకేష్ సహా అందరూ అమరావతి కుంభకోణం పై విచారణ జరపించమంటే జరిపిస్తామని మొదట అన్నది బొత్సనే. ఇప్పుడు సీఐడీ విచారణ సాగుతోంది. ఇక బిల్లులు అడ్డుకుంటున్న శాసన మండలిలో రచ్చ చేసిన బొత్స దాన్ని లేకుండా చేయాలని అన్నారు. జగన్ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.ఇలా ఒకటా రెండా? చాలా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను మొదట లీక్ చేసేది బొత్సనే. సీనియర్ కావడం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పని చేయడం.. అపార అనుభవం దృష్ట్యా బొత్సను ముందు పెట్టి జనాలలో చర్చకు పెట్టి.. దాన్ని నానేలా చేసి.. దానిపై జనం నిర్ణయానికి అనుగుణంగా అమలు చేస్తున్నారు సీఎం జగన్. ఇలా జగన్ తుపాకీ లో ఇప్పుడు బొత్స ఓ బుల్లెట్ అవుతున్నారన్న చర్చ సాగుతోంది.