ఢిల్లీ అల్లర్లపై ప్రతిపక్షాలు ఆందోళన.. వాయిదా ఉభయ సభలు
న్యూఢిల్లీ మార్చ్ 2
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభంకాగానే జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్ మృతికి సభ సంతాపం తెలిపింది. ఢిల్లీ అల్లర్లలో 42 మంది మృతిచెందడంతో పాటు చాలా మంది గాయపడిన నేపథ్యంలో ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఉభయ సభల్లోనూ వాయిదా తీర్మానాలు ఇచ్చి చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీ అల్లర్ల అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ లోక్సభా పక్షనేత అధిర్ రంజన్ చౌధురి సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ఢిల్లీ అల్లర్లపై విపక్షాలు ఆందోళన చేయడంతో పార్లమెంట్ ఉభయసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపాయి. ఈ నిరసనలో రాహుల్ గాంధీ, శశిథరూర్, అధిర్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.