రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతోంది: గోరంట్ల
రాజమండ్రి మార్చ్ 2
రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై పన్నులు వేసినందుకు నిరసనగా రాజమండ్రిలో టీడీపీ ఆందోళన చేపట్టింది. సైకిళ్లతో ఆటోను లాగి బుచ్చయ్య చౌదరి, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యాట్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. 300 యూనిట్లు దాటితే సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకొని అర్హులకు అన్యాయం చేస్తున్నారని వెల్లడించారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేయటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకుంటున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.