బిసి మహిళా సర్పంచ్ కి ఘోరమైన అవమానం
కరీంనగర్ మార్చ్ 2
కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో గుండారం గ్రామానికి చెందిన ఒక బిసి మహిళా సర్పంచ్ కి ఘోరమైన అవమానం జరిగింది. అవమానం చేసింది ఎవరో వేరే పార్టీ వాళ్లయితే సొంత పార్టీకి చెప్పుకోవచ్చు. సొంత పార్టీ వాళ్లే అవమానం చేస్తే? ఏం చేయాలి నోరు మూసుకుని పడి ఉండాలి.అయితే పాపం ఈ బిసి మహిళా సర్పంచ్ అలా నోరు మూసుకుని ఉండలేకపోయారు. ఆమె చేసిన పాపం ఏమిటంటే టీఆర్ఎస్ రెబెల్ గా గెలవడమే. తనకు కాదని స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వేరేవారికి సీటు ఇప్పిస్తే శెట్టి లావణ్య అనే ఈ బిసి మహిళ జన బలంతో సర్పంచ్ గా గెలిచారు.కాంగ్రెస్ పార్టీలో తరతరాలుగా ఉంటున్న ఈ కుటుంబం ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న సేవ, వేస్తున్న ప్రణాళికలు చూసి తెలంగాణ అభివృద్ధితో తాము కూడా మమేకం కావాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ లో చేరారు. ఆ నాటి నుంచి ఈ నాటి వరకూ ఆమె అవమానాల పాలు అవుతూనే ఉన్నారు.తాజాగా గ్రామంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శెట్టి లావణ్యను ఘోరంగా అవమానించారు. నీకు చదువు రాదుకదా పక్కన నిలబడు ఉప సర్పంచ్ తాళ్లపెల్లి రాము చెక్కులు ఇస్తాడు అని అన్నారని లావణ్య చెప్పి బాధపడ్డారు.ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులు అందివ్వ డానికి సర్పంచ్ చదువుకు సంబంధం ఏమిటో లావణ్యకు అర్ధం కాలేదు. కేవలం రాజకీయ కారణాలతో తనను అధికారిక కార్యక్రమానికి అడ్డుకోవడం అన్యాయమని ఆమె అంటున్నారు. జాయింట్ చెక్ పవర్ విషయంలో కూడా లావణ్య చాలా అవమానాలను ఎదుర్కొటున్నారు.