.తెలుగుదేశం పార్టీ యువ నేతలకు లోకేశ్ విందు
హైదరాబాద్, మార్చ్ 2
తెలుగుదేశం పార్టీలో రాబోయే రోజుల్లో కొత్త తరం కీలక పాత్ర పోషించబోతున్నదనే సంకేతాన్ని ఇచ్చేందుకు పార్టీ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానా అన్నట్లు ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం పార్టీ యువ నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం హైదరాబాద్లో విందు ఇచ్చారు.నాయకులను వారి భార్యలను కూడా ఆహ్వానించి దీన్ని ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ గా చేయడంతో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. భార్యాభర్తలను కలిపి ఆహ్వానించడంతో సుమారు ముప్పై ఐదు జంటలు ఈ విందులో పాల్గొన్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.లోకేశ్ తన భార్య బ్రహ్మణితో కలిసి అందరినీ ఆహ్వానించారు. పోయిన ఎన్నికల్లో పోటీచేసిన యువ నేతలు, ప్రస్తుతం చురుగ్గా ఉండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనుకొంటున్న నేతలు, పార్టీలోని ప్రముఖ నేతల వారసులను దీనికి పిలిచినట్లు సమాచారం.హాజరైన వారిలో రామ్మోహన్నాయుడు, గౌతు శిరీష, బండారు అప్పలనాయుడు, చింతకాయల విజయ్, టీజీ భరత్, జేసీ పవన్కుమార్ రెడ్డి, పయ్యావుల కేశవ్, పరిటాల శ్రీరాం, భూమా అఖిలప్రియ, దీపక్ రెడ్డి, బొజ్జల సుధీర్రెడ్డి, కేఈ హరి, గాలి భానుప్రకాశ్, ఆదిరెడ్డి భవాని తదితరులు ఉన్నారు