ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 35 కోట్ల లంచం: దిగ్విజయ్ సింగ్
న్యూఢిల్లీ మార్చ్ 2
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ భారతీయ జనతా పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 35 కోట్ల లంచం ఇచ్చేందుకు సిద్ధమవుతుందని దిగ్విజయ్ పేర్కొన్నారు. సీఎం కమల్నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మాజీ సీఎం, బీజేపీ నాయకులు శివరాజ్సింగ్ చౌహాన్, నరోత్తమ్ మిశ్రా ప్రణాళికలు రచిస్తున్నారని తెలిపారు. పదిహేను ఏండ్లు రాష్ర్టాన్ని దోచుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవడానికి బీజేపీ నేతలకు ఇష్టం లేదు. అందుకే బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు వారు ప్రయత్నాలు మొదలుపెట్టారని సింగ్ చెప్పారు.ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరిస్తే ఇప్పటికిప్పుడు రూ. 5 కోట్లు.. బలపరీక్ష సమయంలో మిగతా నగదు చెల్లిస్తామని బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్.. కర్ణాటక లాంటిది కాదు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడపోరని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు లాంటి అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని దిగ్విజయ్ తేల్చిచెప్పారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో 230 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్ 114 స్థానాలను గెలుచుకుని నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఎస్పీ ఎమ్మెల్యే సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేసీ 109 స్థానాలను గెలుచుకుంది.