పార్టీ మారేందుకు సిద్ధమౌతున్న గాదె
ఒంగోలు, మార్చి 3,
గాదె వెంకట రెడ్డి. సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఎల్ఎల్ఎల్బీ చదివిన గాదె వెంకటరెడ్డి 1967లోనే రాజకీయాల్లోకి వచ్చారు. ప్రకాశం జిల్లా పరుచూరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఆయన 1983లోనే మంత్రి గా చక్రం తిప్పారు. కాంగ్రెస్ పార్టీతో ఎనలేని అనుబంధం పెంచుకున్న గాదె.. సౌమ్యుడిగా, అవినీతి రహిత నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ కుటుంబానికి కూడా ఆయన చేరువయ్యారు. వైఎస్ సీఎం అయ్యేందుకు పరోక్షంగా గాదె వెంకటరెడ్డి కూడా ప్రోత్సహించారు. వైఎస్ కూటమిలో చాలా కాలం పనిచేవారు. తర్వాత కాలంలో ఆయన బాపట్ల నియోజకవర్గం నుంచి కూడా గెలుపు గుర్రం ఎక్కారు.2004 ఎన్నికల్లో పరుచూరు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇవ్వడంతో గాదె బాపట్లకు మారిపోయారు. ఈ క్రమంలోనే 2009-10 మధ్య దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఏపీ ప్రజల మనసులోని మాటలను కూడా వెల్లడించారు. అయితే, కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో ఉన్న గాదె వెంకటరెడ్డి తన వారసుడిని రంగంలోకి దింపాలనే ప్రయత్నం మాత్రం సాకారం కావడం లేదు. అసలు టీడీపీలోకి చేరడం వెనుక తనకుమారుడు మధుసూదనరెడ్డికి రాజకీయంగా ఓ వేదికను ఏర్పాటు చేయడమేనని అందరికీ తెలిసిందే.టీడీపీలో చేరుతున్న సమయంలోనే ఆయన ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. ఈ క్రమంలోనే బాపట్ల నుంచి అవకాశం కోసం ఎంతో ప్రయత్నం చేశారు. కానీ, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ప్రయత్నించారు. కానీ, చంద్రబాబు గాదె వెంకటరెడ్డి ప్రయత్నాలను ముందుకు సాగనివ్వలేదు. ఈ క్రమంలో అన్నం సతీష్కు గత ఏడాది ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు. ఇక, ఆయన గెలవకపోగా ఎమ్మెల్సీగా ఉంటూనే బీజేపీలోకి చేరిపోయారు. ఇక, దీంతో బాపట్ల టీడీపీ ఇంచార్జ్ సీటు ఖాళీ అయింది. ఈ క్రమంలో ఇప్పుడైనా తన కుమారుడికి చంద్రబాబు అవకాశం ఇస్తారని గాదె వెంకటరెడ్డి ఆశలు పెట్టుకున్నారు.ఎన్నికలకు ముందు వరకు హంగామా చేయని గాదె వెంకటరెడ్డి కుమారుడు ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక సతీష్ బీజేపీలోకి జంప్ చేశాక అయినా తనకు పార్టీ ఇన్చార్జ్ ఇస్తారని వెయిట్ చేశారు. కానీ, అనూహ్యంగా ఇక్కడ వేగేశ్న నరేంద్ర వర్మకు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు గాదె వెంకటరెడ్డి కారాలు మిరియాలు నూరుతున్నారు. తాము ఒక లక్ష్యంతో టీడీపీలో చేరామని. ఇప్పుడు తమను పట్టించుకోకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ఆయన తన అనుచరుల వద్ద అంటున్నారు.ఈ క్రమంలోనే పార్టీలో విభేదాలు సృష్టించేలా కూడా వ్యవహరిస్తున్నారు. మరోపక్క, వైసీపీలోకి చేరిపోయేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే, ఇక్కడ చి డిప్యూటీ స్పీకర్ కోన శశిధర్ ఉండడంతో జగన్ ఎవరినీ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ వచ్చినా.. ఎలాంటి షరతులు ఉండవని అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలా? అని గాదె వెంకటరెడ్డి సతమతమవుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.