బలహీన వర్గాల వారిపై కక్ష కట్టిన వై ఎస్ జగన్: యనమల
గుంటూరు మార్చ్ 3
బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సిఎం వై ఎస్ జగన్కు ఇష్టం లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 15 వేల పోస్టులు రాకుండా జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వెన్నెముక బీసీలని తెలిసే వారిపై కక్షగట్టారని ఆయన అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిథ్యం తగ్గించేందుకే ఇలాంటి చర్యలు చేపట్టారని అన్నారు. తన అనుచరుడితో జగన్ హైకోర్టులో పిటిషన్ వేయించారని యనమల ఆరోపించారు. 60 శాతం రిజర్వేషన్లతో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు.రెడ్డి సంఘం అధ్యక్షుడితో కేసు వేయించడమే బీసీలపై జగన్ వ్యతిరేకతకు రుజువు అని యనమల వ్యాఖ్యానించారు. బీసీ నిధుల్లో భారీగా కోతలు పెట్టారని, ఆదరణ పథకం రద్దు చేశారని అన్నారు. బీసీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించారని, ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు.ఇప్పుడు పేదల అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలపై కక్షతోనే రిజర్వేషన్ల అంశం కేంద్రం దృష్టికి జగన్ తీసుకెళ్లలేదని యనమల విరుచుకుపడ్డారు.