మండలి రద్దుపై టెన్షన్ టెన్షన్
విజయవాడ, మార్చి 4,
శాసనమండలి విషయంలో వైసీపీికి దిగులు పట్టుకుంది. శాసనమండలి రద్దు అంశంపై కేంద్ర ప్రభుత్వం వైఖరి ఇంకా తేలకపోవడంతో వైసీపీ నీరసపడిపోయిందనే చెప్పాలి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ బిల్లు వచ్చే అవకాశం లేదన్నది ఢిల్లీ వర్గాల సమాచారం. శాసనమండలి రద్దు చేయకుంటే ఉభయ సభలను రేపు బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం సమావేశ పర్చాల్సి ఉంటుంది. కానీ ఇది జగన్ కు ఇష్టం లేదు. కానీ ఢిల్లీలో పరిస్థితులు సానుకూలంగా లేవు.శాసనమండలిలో సీఆర్డీఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంతో ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహానికి గురయ్యారు. అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను శాసనమండలి ద్వారా టీడీపీ అడ్డుకుంటుందని జగన్ భావించారు. తనకు రాజకీయంగా నష్టమని తెలిసినా జగన్ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే ఇంతవరకూ దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కన్పించడం లేదు. ధానంగా శాసనమండలి రద్దు అంశంపైనే జగన్ రెండుసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. తొలి పర్యటనలో ప్రధాని మోదీని కలిసి వచ్చిన జగన్, రెండోదఫా పర్యటనలో అమిత్ షాను కలసి మండలి రద్దు అంశంపైనే చర్చించారు. దీంతో శాసనమండలి రద్దును కేంద్రం ఆమోదిస్తుందని జగన్ భావించారు. కొంత ఆలస్యమైనా రద్దు గ్యారంటీ అనుకున్నా, ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మండలి రద్దు అవుతుందని జగన్ గట్టిగా అనుకున్నారు. ఢిల్లీ స్థాయిలో వైసీపీ నేతలు ఇదే పనిమీద లాబీయింగ్ చేస్తూ ఉన్నారు.పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో మండలి రద్దు బిల్లు లేదు. దీంతో కొంత వైసీపీ నేతలు డీలా పడ్డారు. అయితే లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో లేకపోయినా సప్లిమెంటు బిల్లుగా అజెండాలో చేర్చవచ్చని, టేబుల్ ఐటెంగా అయినా తీసుకురావచ్చని వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే కేంద్రం వద్ద శాసనమండలికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థనలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై ఒక జాతీయ విధానం రూపొందించాలని కేంద్రం ఆలోచిస్తుంది. అందుకే శాసనమండలి రద్దు అంశంలో కేంద్రం జాప్యం చేస్తుందంటున్నారు. మొత్తం మీద వైసీపీకి శాసనమండలి రద్దు విషయంలో ఇంకా కొన్ని రోజులు టెన్షన్ తప్పేట్లు లేదు.