మరో ప్రయాగానికి ఇస్రో సిద్దం
నెల్లూరు మార్చి 4,
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ -ఎఫ్ 10 రాకెట్ ద్వారా తొలి జీయో ఇమేజింగ్ ఉపగ్రహమైన జీఐశాట్ -1ను నింగిలోకి ప్రవేశపెట్టనుంది. భారత ఉపఖండాన్ని నిరంతరం పరిశీలిస్తూ అత్యంత స్పష్టమైన ఛాయా చిత్రాలను చిత్రీకరించడంతో పాటు, ప్రకృతి విపత్తులతో పాటు దేశీయ రక్షణ రంగానికి సంబంధించిన సమాచారాన్ని అందించే విధంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. అదేవిధంగా ఖనిజ సంపద, వ్యవసాయ, అటవీ, సముద్ర జలాలు, మంచు పర్వతాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించనుంది. 2268 కిలోల బరువైన ఈ ఉపగ్రహం భూమికి 249.5 కిలోమీటర్ల ఎత్తులోని భూసమసితి కక్ష్యలోకి జీఎస్ఎల్వీ -ఎఫ్ 10 రాకెట్ ప్రవేశపెట్ట నుంది. అనంతరం బెంగుళూరులోని బైలాలు ఉపగ్రహ నియంత్రణ కేంద్రం ఆధీనంలోకి జీఐశాట్-1 ఉపగ్రహాన్ని తీసుకుని నియంత్రించనున్నారు. ప్రకృతి విపత్తులు.. దేశరక్షణ లాంటి అతిముఖ్యమైన రంగాలకు ఆయువుపట్టులాంటి సమాచారాన్ని అందించే.. ఈ ప్రయోగం పై...శాస్త్రవేత్తలు మంగళవారం ఎంఆర్ఆర్ (మిషన్ రెడీనెస్ రివ్యూ) కమిటీ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్ పూర్తి చేశారు.బుధవారం బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్ఆర్ చైర్మన్ బీఎన్ సురేష్, కాటూరి నారాయణ ఆధ్వర్యంలో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మూడు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేస్తారు. తర్వాత తుదివిడత పరీక్షలు నిర్వహించి. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగిస్తారు. ఆపై సాయంత్రం ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరోమారు రిహార్సల్స్ పూర్తిచేసి... సా.3.43 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభిస్తారు. ఆ వెంటనే రెండో దశలో 42.21 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ ప్రారంభమౌతుంది. అనంతరం గురువారం సాయంత్రం 5.43 గంటలకు జిఎస్సెల్వి ఎఫ్-10 నింగిలోకి దూసుకెళ్లి భూస్థిర కక్ష్యలోకి జీఐశాట్-1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది.