గవర్నర్ ను కలిసిన టిడిపి నేతలు
విజయవాడ మార్చి 04
ఏపీ రాష్ట్ర గవర్నర్ ను బిశ్వభూషణ్ హరిచందన్ ను టీడీపీ నేతల బృందం బుధవారం కలిసింది. అచ్చెన్నాయుడు, బచ్చుల అర్జునుడు ,బుద్దా వెంకన్నతదితరులు అయను కలిసారు. స్ధానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల లో బీసీ లకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని గవర్నర్ కు పిర్యాదు చేసారు. తరువాత అచ్చేన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఏపీలో 50 శాతం కంటే ఎక్కువగా బలహీన వర్గాలు ఉన్నారు. టిడిపి వలనే బలహీన వర్గాలకు రాజకీయ, ఆర్ధిక, సామాజికంగా అవకాశాలు వచ్చాయి. స్థానిక ఎన్నికల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ కి దక్కింది. బలహీన వర్గాల పట్ల జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బలహీన వర్గాలు టిడిపి కి అండగా ఉన్నాయని జగన్ అణచివేస్తున్నారు. బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గవర్నర్ ను కలిసాం. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం తో 16 వేల పదవులు కోల్పోతున్నారు. వైయస్ ,కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. సుప్రీంకోర్టు చెప్పిందని జగన్ కుంటిసాకులు చెపుతున్నాడని విమర్శించారు. సుప్రీంకోర్టు లో కేసులు వేసింది వైసీపీ నేతలే. రాప్తాడు మండల వైసీపీ కన్వీనర్ కేసులు వేసాడు. వాళ్ళని ఎదురుగా పెట్టి కేసులు వేసింది ఎవరి మనుషులో తేల్చుకుందామని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు కు వెళ్ళాలి. ఎన్నికలు పెట్టకుండా కోర్టుకు వెళ్ళాలి. మీరు వెళ్లకపోతే, మేము సుప్రీంకోర్టు కు వెళుతున్నాం. ప్రభుత్వం వెళ్లకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు. వైసీపీ బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు జగన్ ను నిలదీయాలని అన్నారు. 34 నుంచి 24 శాతానికి తగ్గించాలంటే చట్టం చేయాలి. అసెంబ్లీ ఆమోదించాలి. ఇంత హడావుడి గా నిర్ణయం తీసుకోవడం కుదరదు. ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తే ఆమోదించవద్దని గవర్నర్ ను కోరామని అయన వెల్లడించారు.