రాష్ట్ర అభివృద్దికోసమే బీజేపీతో దోస్తీ
విశాఖపట్నం మార్చి 04
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, అభివృద్ధి కోసమే తమ పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి పనీ జరగలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాల రంగులు మార్చుతూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో రివర్స్ టెండర్ల పేర్లతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఇటువంటి పనులకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూ పడిపోయిందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే వైసీపీ ఇప్పుడు చేస్తోందని విమర్శించారు.వైఎస్ఆర్సిపిది అసమర్థ పాలన, వెనకబడిన ప్రాంతాలకు కేంద్రం ఇచ్చే నిదులను తీసుకురావడంతో ఏపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు.రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుతో పాటు చాలా ప్రాజెక్టులు అర్ధంతరంగా నిలిచిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.వెనకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే యువతకు తమ అధినేత పవన్ కళ్యాణ్ టిక్కెట్లు ఇచ్చారని తెలిపారు. రాజధాని విషయంలో జనసేన పార్టీపై కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి మద్దతు తెలిపి, అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డిలా మాటమార్చడం జనసేన సిద్దాంతం కాదని అన్నారు.