వైసీపీ ట్రబుల్ షూటర్ గా సజ్జల
విజయవాడ, మార్చి 5,
ట్రబుల్ షూటర్... వైసీపీ సమస్యలను పరిష్కరించడంలో ఇటీవల కాలంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, సీఎం జగన్కు రాజకీయ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఉన్నతస్థాయి చదువులు చదివిన ఆయన గతంలో జగన్ మీడియాలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా సాక్షి పత్రిక స్థాపన దగ్గర నుంచి ఆయన ఆ పత్రికను ప్రజల పక్షం చేయడంలో ముందున్నారు. అయితే, వైసీపీ ప్రారంభించిన తర్వాత రెండేళ్లకు అంటే 2014లో ఆయన పూర్తిస్థాయిలో పార్టీకి అంకితమయ్యారు. జగన్కు దూరపు బంధువు కూడా అయిన సజ్జల .. వ్యాపార భాగస్వామికూడా.పార్టీపై పట్టు పెంచుకోవడంతోపాటు పార్టీ కార్యక్రమాలను కూడా సజ్జల నిర్వహిస్తున్నారు. గతఏడాది ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాలకు ఆయననే ఇంచార్జ్గా నియమించారు జగన్. దీంతో అప్పటి వరకు ఉన్న అనేక సమస్యలను సజ్జల రామకృష్ణారెడ్డి పరిష్కరించారు. సజ్జల ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఆచితూచి వ్యవహరిస్తారు. ఎలాంటి సమస్యనైనా ఆయన సాగదీయరు. తన వద్దే 90శాతం ఆసమస్యకు పరిష్కారం చూపిస్తారు. దీంతో జగన్ గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆధాపడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొం టోంది.ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయం లేక పోవడం దగ్గర నుంచి ప్రభుత్వ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే వ్యూహాత్మక ఎత్తుగడలు కూడా లోపించాయి. దీంతో ఈ బాధ్యతను జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిరి అప్పగించా రని తెలుస్తోంది. తాజాగా మంత్రుల విషయంపై సజ్జల దృష్టి పెట్టినట్టు సమాచారం. వారు ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై జగన్ ఒకింత అసంతృప్తిగా ఉన్నారు. అసలు వారానికి రెండు రోజులు సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ సూచించినా వారు రావడం లేదు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యతను సజ్జలకు అప్పగించారు. వెంటనే కదిలిన సజ్జల వారానికి రెండు రోజులు కాదుకానీ.. ప్రతి బుధవారం మంత్రులు సచివాలయానికి వచ్చేలా పక్కా వ్యూహంతో ఆ ఆర్డర్ పాస్ చేయించారు.దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలనే షరతు కూడా విధించారు. అదే సమయంలో మంత్రులు ఏం చేస్తున్నారో కూడా ఆయన నివేదికలు తెచ్చుకుంటున్నారట. ఈ పరిణామంతో మంత్రులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. పైకి గంభీరంగా ఉండరు. ఎవరిపైనా ఆవేశ పడరు. ఆగ్రహం అసలే లేదు. ఇలాంటి మనిషి మనపై కన్ను వేశారంటే.. ప్రమాదమేనని, వారు బిక్కటిల్లుతున్నారట. మొత్తానికి జగన్ వ్యూహం.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆగమనంతో కేబినెట్ మంత్రులు అలెర్ట్ అవుతున్నారని అంటున్నారు. మరి ఎలాంటి మార్పులు కనిపిస్తాయో చూడాలి.