గార్గ్ పైనే జగన్ ఆశలు
విజయవాడ, మార్చి 5
ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. సంక్షేమ కార్యక్రమాలు దూకుడుగా అమలు చేయడం, రాబడి తగ్గిపోవడంతో అధికార వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. పాలన గాడి తప్పిందని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ నాశనం చేశారని ఘాటు పదాలు ఉపయోగిస్తున్నాయి. ఈ సమయంలో జగన్ తన ఆర్థిక సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్ ను నియమించుకున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో సలహాదారులు ఎక్కువైనప్పటికీ గార్గ్ నియామకంలో ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలిసుభాష్ చంద్ర గార్గ్ ను మాత్రమే ఏరికోరి జగన్ సలహాదారుగా ఎందుకు ఎంపిక చేసుకున్నారని సహజగంగానే అనుమానాలు తలెత్తాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆర్థిక ఒడిదుడుకుల నుంచి గట్టెక్కించడం ఒక్క గార్గ్ వల్లనే సాధ్యమవుతుందని జగన్ గట్టిగా నమ్మారు. అందుకే సుభాష్ చంద్ర గార్గ్ నియామకం వేగంగా జరిగిపోయింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా జగన్ మాత్రం గార్గ్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారంటున్నారు.సుభాష్ చంద్ర గార్గ్ సీనియర్ ఐఏఎస్ అధికారి. రిటైర్ అయ్యారు. గార్గ్ ను నియమించడానికి బలమైన కారణాలున్నాయి. గార్గ్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆయనకు కేంద్ర స్థాయిలో సీనియర్ ఐఏఎస్ లతో పరిచయాలున్నాయి. ఆయనకంటే జూనియర్లు ఇప్పుడు ప్రధాన శాఖల్లోనూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి గార్గ్ నియామకం తనకు ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడం, కేంద్ర స్థాయిలో అధికారులను సమన్వయం చేయడం, మంత్రిత్వ శాఖ నిపుణులతో చర్చించడం వంటివి గార్గ్ చేయనున్నారు. ప్రస్తుతం సంక్షేమ పథకాల కోసమే యాభై వేల కోట్లు కేటాయించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ నిధులను తేవడమే కాకుండా, రాష్ట్రంలో ఆర్థిక వనరుల సమీకరణ బాధ్యతను కూడా జగన్ గార్గ్ మీద పెట్టారు. ఈయనకు తోడుగా మరో ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను నియమించారు. మరి జగన్ నమ్మకాన్ని గార్గ్ నిలబెట్టుకుంటారా? రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.