అసెంబ్లీ సమావేశాలకు ‘కరోనా వైరస్ ‘ భయం
హైదరాబాద్ మార్చ్5
శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ‘కరోనా వైరస్ ‘ భయం పట్టుకుంది. సమాజం అత్యంత కీలకంగా పరిగణించే చట్ట సభలో…. ప్రాధాన్యత ఉన్న ఎమ్మెల్యేలను ఈ భయంకరమైన వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఒక అతి ముఖ్యమైన వ్యూహం తో ముందుకు వచ్చింది.వైద్య ఆరోగ్య శాఖతో కలిసి కరోనా ప్రివెన్షన్ పాలసీ ముసాయిదా రూపొందించి సి ఎం కె చంద్రశేఖర్ రావు ముందుంచింది. అత్యంత గోప్యంగా రూపొందించిన ఈ డాక్యుమెంట్ రాజముద్ర కోసం అగింది.. మరో ఇరవై నాలుగు గంటలలో ప్రాముఖ్యత కలిగిన కరోనా రాజపత్రం గవర్నర్ ఆమోదం పొంది ‘ వైరస్ ప్రివెన్షన్ ‘ వి. వి. ఐ.పి. వార్డు ఏర్పాటు కు మార్గం సుగమం చేస్తుంది. శాసనసభ్యుల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు తాత్కాలికంగా అసెంబ్లీ లాంజ్ లోనే దీనిని ఏర్పాటు చేస్తారు . వైద్య పరికరాలు,వైరస్ నిరోధక ఔషధాలు , అత్యంత ముఖ్యమైన మాస్క్ లు,గ్లవ్స్…ఇతర వైద్య సామాగ్రిని హుటాహుటిన దిగుమతి చేసుకుని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం లోగా చేర్చేందుకు వైద్య శాఖాధికారులు.. ప్రముఖ డాక్టర్లు రూట్ మ్యాప్ ఫాలో అవుతున్నారు.అయితే అసెంబ్లీలో ‘ఐసొలేషన్ వార్డు ‘ ఏర్పాటు విషయం సభాపతి మాత్రమే ప్రకటించవలసి ఉంటుంది . మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు విధిగా కరోనా వైరస్ పరీక్షలు చేయించి నెగెటివ్ ఫలితాలు సాధించగలమని వైద్య నిపుణులు ధీమా వ్యక్తం చేస్తుంటే ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు మాత్రం అనుకోకుండా వచ్చి ‘ కరోనా వైరస్ ‘ నివారణకు నిధులు ఏ ‘హెడ్ ‘ కింద విడుదల చేయాలా అని జుట్టు పీక్కుంటున్నారు.