పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై లెక్క తేల్చిన కేంద్ర ప్రభుత్వం
న్యూ ఢిల్లీ మార్చ్ 5
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ వేదికగా మరోసారి తేల్చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. పోలవరం ప్రాజెక్ట్ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు..? అని కేంద్రాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. ఇందుకు కేంద్రమంత్రి షెకావత్ స్పందిస్తూ సమాధానమిచ్చారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన సమాధానం ఇచ్చారు. ‘ ఫిబ్రవరి నాటికి పోలవరం నిర్మాణం 69.54శాతం పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. వందశాతం పోలవరం ప్రాజెక్ట్ ఖర్చును కేంద్రమే భరిస్తుంది. కేంద్రం ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.8, 614.16 కోట్లు ఏపీకి తిరిగి చెల్లించాం. గత నెలలో రూ.1850 కోట్లు విడుదల చేశాం. ఖర్చు, ఆడిట్ నివేదికలు ఇవ్వాలని 2018, 2019లో లేఖలు రాశాం.. రాసిన రెండు లేఖలకు ఏపీ ప్రభుత్వం స్పందించలేదు’ అని షెకావత్ తేల్చి చెప్పారు.