కడప జిల్లాల్లో టీడీపీ జోష్
కడప, మార్చి 5
రాష్ట్రమంతటా టీడీపీ నేతల్లో నైరాశ్యం నెలకొని ఉన్నా ఈయన మాత్రం జోష్ మీద ఉండటం విశేషం. ఓటమి పాలయి తొమ్మిది నెలలు మాత్రమే అయినా ఈ నేతలో మాత్రం పట్టుదల తగ్గలేదు. ఓటమి పాలయిన చోటే మళ్లీ గెలవాలని పట్టుదలతో ఉన్నట్లుంది. ఆయన తన మామ తరహాలో విచిత్ర వేషాలు వేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే మాజీ ఎంపీ దివంగత శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్. కడప జిల్లాలో అందరు టీడీపీ నేతలు దాదాపు చేతులెత్తేసినా ఈయన మాత్రం తాను తగ్గేది లేదంటున్నారు.కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో నరసింహప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు కావడంతో ఈయనకు టీడీపీ టిక్కెట్ సులభంగానే లభించింది. అయితే జగన్ హవాలో ఈయన ఓటమి పాలయ్యారు. అయితే కడప జిల్లాలో చంద్రబాబు ఇచ్చిన ప్రతిపిలుపునకు స్పందిస్తుంది నరసింహ ప్రసాద్ మాత్రమే. రోజుకో గ్రామంలో పర్యటిస్తూ పార్టీతో పాటు తాను కూడా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు నరసింహ ప్రసాద్.చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడుగా మాత్రమే ఈయన కొద్ది మందికి తెలుసు. రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో అక్కడి నుంచి పోటీ చేయాలని నరసింహ ప్రసాద్ నిర్ణయించుకున్నారు. మామ శివప్రసాద్ ఆశీస్సులతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ కాలం కలసి రాలేదు. మామ శివప్రసాద్ మరణంతో ఒకింత కుంగిపోయిన నరసిింహ ప్రసాద్ తర్వాత తేరుకుని పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో పడ్డారు.శివప్రసాద్ మాదిరిగానే విచిత్ర వేషాలు వేస్తూ జనాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు. జగన్ నవరత్నాలు, మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో ఆయన వేసిన తుగ్లక్ వేషం అందరినీ ఆకట్టుకుంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉండగా ఇప్పటికే నరసింహ ప్రసాద్ ఐదు మండలాల్లో పర్యటించడం విశేషం. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కూడా నరసింహ ప్రసాద్ ప్రశంసలు అందుకోవడం విశేషం.