కొనసాగుతున్న టెన్షన్
హైద్రాబాద్, మార్చి 6
టీఆర్ఎస్లో కేసీఆర్ తరువాత కేటీఆర్కు ప్రాధాన్యత ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలోనే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ సన్నాహాలు కూడా చేస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఇదిలా ఉంటే... తాజాగా టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎంపిక కాబోయే వారి విషయంలోనూ కేటీఆర్ చెప్పిన వారికి ప్రాధాన్యత ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు రెండు స్థానాలు దక్కనున్నాయి. సాధారణంగా ఇలాంటి విషయాల్లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారు.కానీ టీఆర్ఎస్లో కేటీఆర్ ప్రాధాన్యత మరింత పెరిగిన నేపథ్యంలో... రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కేటీఆర్ ఛాయిస్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని అభ్యర్థులను ఖరారు చేయనున్న కేసీఆర్... ఇద్దరిలో ఒకరి ఎంపిక ఛాయిస్ను కేటీఆర్కు వదిలేయాలని నిర్ణయించినట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. అందుకే రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారిలో పలువురు కేటీఆర్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారనే వార్తలు టీఆర్ఎస్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.అయితే రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో తుది నిర్ణయం కేసీఆర్దే అని... అయితే వర్కింగ్ ప్రెసిడెంట్గా అభ్యర్థుల ఎంపిక విషయంలో కేటీఆర్ సూచనలను కేసీఆర్ తీసుకుంటారని మరికొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ తరపున పెద్దల సభకు వెళ్లే అదృష్టవంతులు ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది