గవర్నర్తో అసెంబ్లీలో అబద్దాలు పలికించిన టీఆర్ఎస్ ప్రభుత్వం
హైదరాబాద్ మార్చ్ 6
టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైతో అసెంబ్లీలో అబద్దాలు పలికించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామన్నారు.బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదని, పాత సీసాలో కొత్త సారా అనే సామెతలా ఉందన్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను నిరాశపరిచే విధంగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. నిరుద్యోగ భృతి విషయం ప్రస్తావించలేదని, ప్రభుత్వం చెప్పేవి వినివిని చెవుల నుంచి రక్తాలు కారుతున్నాయన్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందినదని స్పష్టంగా తెలుస్తోందని రామచంద్రరావు విమర్శించారు.