సమరానికి సన్నద్ధం
50శాతం రిజర్వేషన్లపై 559 జీవో జారీ
విజయవాడ మార్చ్ 6
స్థానిక సంస్థల ఎన్నికల ముహూర్తం సమీపించింది. పంచాయతీ, జడ్పీ ఎన్నికల్లో ఎస్టి, ఎస్సీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి సంస్థ బుధవారం 559 జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. మున్సిపల్ శాఖ బహుశా మరో జీవో ఇస్తుందేమో. ఈ నేపథ్యంలో బీసీలకు కేవలం 24 శాతం మాత్రం రిజర్వేషన్లు దక్కుతాయి. గతంలో 34 శాతం ఉండేవి. దీనితో ఈసారి ఈవర్గాల ప్రజాప్రతినిధుల సంఖ్య గణనీయంగా పడిపోనుంది. ఏకంగా పది శాతం తగ్గిపోవడంతో ఆయా వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే బీసీ నేతలు ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బలంగా వాదన వినిపించాలని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతోపాటు వివిధ ప్రతిపక్షాలు కూడా బీసీల కోటా తగ్గింపుపై విరుచుపడుతున్నారు. ఇక ఈ రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో ఈనెల 7న నోటిఫికేషన్ జారీ అవు తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50 శాతం మించకుండా పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల స్థానాలకు రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. మున్సిపల్ అధికారులు కూడా ఇప్పటికే రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో వివిధ మున్సిపాల్టీలలో విలీనమై కోర్టు పరిధిలో ఉన్న పంచాయతీలలో ఎన్నికలు జరిగే అవకాశంలేదు. మిగతా పంచాయతీలకు, ఇటీవల పునర్విభజనలో కొత్తగా ఏర్పడ్డపంచాయతీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నిక వాయిదా?: 21 గ్రామాల విలీనంతో కోర్టు తీర్పుకోసం ఎదురుచూస్తున్న రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నిక వాయిదా పడనుంది. మొత్తం గ్రామాలతో కలుపుకుని, కొత్తగా విభజించిన 54 డివిజన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదే శించినట్టు సమాచారం. ఈనేపథ్యంలో కొద్ది ఆలస్యమైనా గ్రేటర్ రాజమహేంద్రవరానికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఈ అంశం ఉండడంవల్ల మిగతా మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నిక వాయిదా వేయనుండగా, కాకినాడకు ఇప్పటికే ఎన్నికల జరగడం వల్ల అక్కడ కూడా ఎన్నికల ప్రసక్తిలేదు. ఇక మిగతా మున్సిపాల్టీలు ఎన్నికలు జరగనున్నాయి.