రేజర్వేషన్స్ తగ్గించి బీసీ కులాలకు జగన్ ప్రభుత్వం ద్రోహం
టీడీపీ నేత యనమల రామకృష్ణుడు
అమరావతి మార్చ్ 6
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా 24శాతానికి తగ్గించి వెనుకబడిన కులాలకు జగన్ ప్రభుత్వం ద్రోహం చేసిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీసీలకు రాజకీయ అవకాశాలను రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీసీ నాయకత్వాన్ని అణగదొక్కి, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావితం చూపేందుకు జగన్ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగిస్తోందని వ్యాఖ్యానించారు. డబ్బు, అధికార బలంతో ఓటర్లను, ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారన్నారు. తుగ్లక్ నిర్ణయాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని యనమల పేర్కొన్నారు.