విశాఖలో సెక్రటేరియెట్ రెడీ
విశాఖపట్టణం, మార్చి 7
అమరావతి నుంచి పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్ సర్కారు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే సెక్రటేరియట్ నిర్మాణం కోసం స్థలాన్ని కూడా రెడీ చేసినట్లు సమాచారం. విశాఖపట్నంలోని మధురవాడలో మిలీనియం టవర్స్కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయం నిర్మించే దిశగా సర్కారు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా.. మిలీనియం టవర్స్లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని భావించినా.. కొన్ని అనివార్య కారణాలతో ఆ ఆలోచన విరమించుకుంది ప్రభుత్వం. కాపులుప్పాడ కొండపై ఐటీ సంస్థల కోసం గతంలో ఐటీ లేఅవుట్ను రూపొందించారు. అదానీ సంస్థ ఆ కొండపై డేటా పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో దాన్ని ఆ సంస్థకు కేటాయించారు. అయితే.. రూ.3వేల కోట్ల పెట్టుబడులే పెడతామని ఆ సంస్థ స్పష్టం చేయడంతో వేరే చోట స్థలం కేటాయించి, కొండపై సెక్రటేరియట్ భవనం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.కొండపై సెక్రటేరియట్, గవర్నమెంట్ ఆఫీసుల నిర్మాణానికి వినియోగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కొండపై 1350 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా, 250 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ వేశారు. ఇప్పటికైతే 175 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇతర భాగాలను కూడా చదును చేసి 600 ఎకరాల భూమిని వినియోగంలోకి తీసుకురావొచ్చని ఏపీఐఐసీ అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.